టీఆర్ఎస్తో కుమ్మక్కైన ఈసీకి, భారతీయ జనతాపార్టీ కార్యకర్తలపై దాడులను అడ్డుకోని డీజీపీకి ఈ ఎన్నికల విజయం అంకితం చేస్తున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, భాజపా ఓబీసీ మోర్చా అధ్యక్షడు లక్ష్మణ్ తో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు ప్రభుత్వ పాలనను నిరసిస్తూ.. బీజేపీపై గురుతర బాధ్యతను ఉంచారని చెప్పుకొచ్చారు. 2023 ఎన్నికల్లో కారు షెడ్డుకే పరిమితమవుతుందని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నిక ఏదైనా గ్రేటర్ తరహా ఫలితాలే పునరావృతం అవుతాయని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ తమకు మతం రంగు పులిపే ప్రయత్నం చేసినా జనం మాత్రం తమనే ఆదరించారన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.