Telangana Assembly: మార్చి 20వరకు అసెంబ్లీ.. ట్విస్టు ఏంటంటే?

|

Mar 06, 2020 | 1:40 PM

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 20వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించింది శానససభ వ్యవహారాల సలహా కమిటీ. శుక్రవారం బడ్జెట్ సమావేశాలు గవర్నర్ తమిళి సై ప్రసంగంతో ప్రారంభం కాగా..

Telangana Assembly: మార్చి 20వరకు అసెంబ్లీ.. ట్విస్టు ఏంటంటే?
Follow us on

Telangana Assembly budget session will continue till March 20th: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను మార్చి 20వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించింది శానససభ వ్యవహారాల సలహా కమిటీ. శుక్రవారం బడ్జెట్ సమావేశాలు గవర్నర్ తమిళి సై ప్రసంగంతో ప్రారంభం కాగా.. ఆ తర్వాత జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో సభ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 20వ తేదీ వరకు సభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినా.. అందులో చిన్ని ట్విస్టు కనిపిస్తోంది. బీఏసీ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం అసెంబ్లీ ఆవరణలో జరిగింది. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు.. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు హరీశ్ రావు ప్రశాంత్ రెడ్డి, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హాజరుకాగా.. ఎంఐఎం తరపున అక్బరుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ పార్టీ పక్షాన మల్లు భట్టి విక్రమార్క సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా అనుకున్నట్లుగానే శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని చేపట్టి.. మార్చి 8 ఆదివారం నాడు వార్షిక బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రతిపాదిస్తారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు, కౌన్సిల్‌లో శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

ఆ తర్వాత మార్చి 9, 10 తేదీల్లో సెలవు దినాలుగా నిర్ణయించారు. అందులో ఒక రోజు బడ్జెట్ అధ్యయనం కోసం సెలవు కాగా.. మరొకటి హోళీ పండుగ సందర్భంగా సెలవు రోజు. ఆ తర్వాత 11 నుంచి 20వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగించాలని బీఏసీ నిర్ణయించింది. మధ్యలో 15వ తేదీ ఆదివారం సెలవుగా నిర్ణయించారు. అయితే ఇందులో ట్విస్టు ఏంటంటే.. సభ నిర్వహణ మార్చి 20వ తేదీ వరకు జరుగుతున్నా సమావేశాలు జరిగేది మాత్రం కేవలం 12 రోజులేనని తెలుస్తోంది.

అయితే.. బీఏసీలో సభ ఎజెండాపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ప్రతిపక్ష కాంగ్రెస్‌లో వున్న ఆరుగురు ఎమ్మెల్యేలు.. వారంతా తలా ఒక సబ్జెక్టుతో వచ్చినా.. ఆరే అంశాలు కాబట్టి.. అడిగిన ప్రతీ అంశాన్ని చర్చకు చేపడదామని, ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని కేసీఆర్ బీఏసీ మీటింగ్‌లో అన్నట్లు తెలుస్తోంది. అయితే సభ పని రోజులను పెంచాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క కోరితే.. కేసీఆర్ మరో సెటైర్ వేశారని తెలుస్తోంది.

‘‘నువ్వు మాట్లాడుతుంటే.. నీ వెనకాల ఎమ్మెల్యేలే వుండరు.. ఇంకా ఎందుకు పెంచడం?’’ అంటూ కేసీఆర్ కామెంట్ చేశారని సమాచారం. కాగా.. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపిన తర్వాత. కరోనా వైరస్ విషయంపై చర్చిద్దామని భట్టి సూచిస్తే ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. సీఏఏకు వ్యతిరేకంగా సభలో తీర్మానం చేయనున్నట్లు కేసీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. మార్చి 20న మరోసారి బీఏసీ సమావేశమై అవసరం మేరకు సమావేశాలను పొడిగించే అంశాన్ని చర్చిస్తుందని చెబుతున్నారు.