హైదరాబాద్ మహానగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి కేటీఆర్. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నగరంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. గత ఐదేళ్లలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 81 రోడ్లను విస్తరణ పనులు చేపట్టామన్నారు. ఇందులో 44 రోడ్లు ఇప్పటికే పూర్తి అయ్యాయన్నారు. ఎస్ఆర్డీపీ కింద రోడ్డు విస్తరణకు 32 రోడ్లు తీసుకున్నాం.. వీటిలో 18 రోడ్లు పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు. మిస్సింగ్ లింకు రోడ్లను 19 తీసుకుంటే.. 12 పూర్తయ్యాయని చెప్పారు. హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు అనేక నిధులు ఖర్చు పెట్టామని తెలిపిన మంత్రి కేటీఆర్.. కేవలం పాత బస్తీ అభవృద్ధికి ఈ ఐదేళ్లలో రూ. 713 కోట్లు ఖర్చు పెట్టి రోడ్ల విస్తరణ పనులు చేపట్టామన్నారు. సాధారణ రోడ్ల కింద రూ. 477 కోట్లు, ఎస్ఆర్డీపీ కింద రూ. 228 కోట్లు, లింకు రోడ్ల కింద రూ. 8 కోట్లు ఖర్చు పెట్టామని వివరించారు. పాత నగరం, కొత్త నగరం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో రోడ్ల విస్తరణతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని మంత్రి తెలిపారు.