నిన్నటి వరకు ఏపీలో టీడీపీకి తిరుగే లేదనుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ మనుగడ కష్టమనిభావించారో ఏంటో తెలియదు గానీ ఒక్కొక్క టీడీపీ నేత సైకిల్ దిగి కమలం గూటికి చేరిపోతున్నారు. ఇటీవల నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన తర్వాత ఇక మేమెంత అనుకున్నారో ఏమో .. పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్న నేతలు సైతం పార్టీ మారుతున్నారు. తాజాగా టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ టీడీపీని విడిచి బీజేపీలో చేరిపోయారు. ఆయనకు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ప్రస్తుతం దినకర్ టీడీపీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఆయన ఉన్నట్టుండి పార్టీ మారడంతో టీడీపీ వాయిస్ను బలంగా వినిపించే వక్త లేకుండా పోయినట్టయిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఇక ఇదే దారిలో మరికొంతమంది కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.