ఆనాడు కర్నూలు జలదీక్షలో జగన్ మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు చూశారని.. పోలవరం పై ఆయన చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. నిపుణుల నిర్ణయాలు తీసుకుని కాపడ్ డ్యామ్ పనులు మొదలుపెట్టామని చెప్పారు. అప్పర్ డ్యామ్, లోయర్ డ్యామ్ పనులు అన్ని 60 శాతం పైగానే పూర్తయ్యాయని దేవినేని చెప్పుకొచ్చారు. అప్పటి ప్రధానిపై ఒత్తిడి తీసుకువచ్చి 7 ముంపు మండలాలని మన భూ భాగంలో కలపబట్టి పోలవరం కల సాకారం అయిందన్నారు.
సీఎంగా ప్రమాణం చేయకముందే పోలవరం రాష్ట్రానికి ఏం సంబంధం అని కేంద్రానికి అప్ప జెప్తానని జగన్ అన్నారని దేవినేని ఉమ గుర్తు చేశారు. తమ మీద కోపంతో పోలవరం పనులు ఆపొద్దని సూచించారు. జలదీక్షలో కాళేశ్వరం గురించి అప్పట్లో చేసిన వ్యాఖ్యలపై జగన్ ప్రజలకి వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంలో కూడా ఎక్కడ నదుల అనుసంధానం గురించి మాట్లాడలేదని.. నీరు చెట్టులో అవినీతి జరిగిందని అసెంబ్లీలో మంత్రులు చెప్పడం సిగ్గుచేటన్నారు. అధికారుల వద్ద పూర్తి సమాచారం ఉందన్న దేవినేని.. అసలు వాస్తవాలను తెలుసుకుని ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.