ఈ క్రికెట్ జనరేషన్లో గొప్ప ఆటగాళ్లు ఎవరంటే.. ఠక్కున రెండు పేర్లు వస్తాయి. ఒకటి టీమిండియా సారధి విరాట్ కోహ్లి, మరొకటి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్. వీరిద్దరిలో ఎవరు గ్రేట్ బ్యాట్స్మెన్ అని ఇప్పటికీ క్రికెట్ వర్గాల్లో చర్చలు జరుగుతుంటాయి. తాజాగా మాజీ క్రికెటర్లు వారివారి అభిప్రాయాలను తెలపగా… అందులో చాలామంది ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నా.. అతి తక్కువ వ్యవధిలోనే మళ్లీ టెస్టుల్లో నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్న స్టీవ్ స్మిత్ గొప్ప బ్యాట్స్మెన్ అని పేర్కొన్నారు.
ఇక ఈ కోవలోనే టీమిండియా మాజీ టెస్టు ఆటగాడు వసీం జాఫర్.. టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ కంటే స్టీవ్ స్మిత్ గొప్ప ఆటగాడు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. బాల్ టాంపరింగ్ వివాదం వల్ల ఏడాది పాటు నిషేధం ఎదుర్కున్నా.. మళ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్లలోనే స్టీవ్ స్మిత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడని జాఫర్ గుర్తు చేశాడు. కాగా, మూడు ఫార్మాట్లలోనూ కలిపి విరాట్ కోహ్లి బెస్ట్ బ్యాట్స్మన్గా నిలుస్తాడన్న జాఫర్.. కోహ్లి తర్వాత వన్డేల్లో రోహిత్ శర్మ గొప్ప ఆటగాడని చెప్పుకొచ్చాడు.