వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయానికే.. సోమవారం దేశంలోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు.. నాలుగు నెలల సీజన్లో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహాపాత్రా వెల్లడించారు.
దేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో… 75 శాతం నైరుతి రుతుపవనాల వల్లే నమోదవుతుంది. మే 30నే రుతుపవనాలు కేరళలోకి ఎంటరయ్యాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అనౌన్స్ చేయగా.. భారత వాతావరణశాఖ మాత్రం ఆ వాదనతో విభేదించింది. నైరుతి రుతుపవనాలు ఈ రోజే కేరళను తాకినట్టు వివరించింది. నైరుతి రుతుపవనాలు మొదట కేరళ తీరాన్ని తాకి.. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి. కేరళ నుంచి కర్ణాటక మీదుగా తెలుగు రాష్ట్రాలలోకి రుతుపవనాలు ఎంటరవుతాయి.