మునిసిపల్ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు హైటెక్ బాట పట్టాయి. ప్రచారం స్టైల్ను మార్చాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర స్థాయి నేతలకు పెద్దగా పని ఉండదు. అంతా లోకల్ వ్యవహారాలు చక్కబెట్టాలి. దీంతో ఇప్పుడు ప్రధాన పార్టీలు టెక్నాలజీని వాడుతున్నాయి. కార్యకర్తలు,నేతలను సమరోత్సాహానికి రెడీ చేస్తున్నాయి.
మునిసిపల్ ఎన్నికల వేళ పార్టీలు కొత్త ప్రచార ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నాయి. ఇన్నాళ్లు రోడ్షోలు, బహిరంగసభలతో అదరగొట్టిన నేతలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే తెలంగాణలో అన్ని చానళ్లు, పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మునిసిపల్ ఎన్నికల వేళ టీఆర్ఎస్లో జోష్ నింపారు. పార్టీ పరంగా ఎలా ముందుకు వెళతామో స్పష్టం చేశారు.
మునిసిపల్ ఎన్నికల అభ్యర్థులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వమించారు. అభ్యర్థుల ప్రచార తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. ప్రచారం ఎలా నిర్వహించాలి? ఓటర్లను ఎలా కలవాలి? అనే విషయాలపై అభ్యర్థులకు కేటీఆర్ పలు సూచనలు చేశారు.
కొన్ని జిల్లాలో ప్రత్యేకంగా అభ్యర్థుల నుంచి కేటీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఆదిలాబాద్, మహబూబ్నగర్, వికారాబాద్, సంగారెడ్డి, రామగుండం, మిర్యాలగూడ, నల్గొండ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులతో పాటు మహిళ అభ్యర్థులతో కేటీఆర్ మాట్లాడారు. స్థానికంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఇటు కాంగ్రెస్ కూడా సోషల్ మీడియా క్యాంపెయిన్ చేపట్టింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేస్బుక్ లైవ్లో కార్యకర్తలతో మాట్లాడారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా నేతలకు ప్రచారంలో తీసుకున్న జాగ్రత్తలను సూచించారు. మొత్తానికి ప్రధాన పార్టీలు సోషల్ మీడియా బాట పట్టాయి. రాబోయే ఎన్నికల ట్రెండ్ను చెప్పకనే చెప్పాయి.