గత 28 రోజులుగా పోలీసులకు చిక్కకుండా అఙ్ఞాతంలో గడిపిన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్కు ఎట్టకేలకు మంగళవారం హైకోర్టు బెయిల్ మంజూరుచేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 26న శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఎంపీడీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి తన అనుచరులతో వెళ్లిన కూన.. అక్కడ పంచాయతీరాజ్ అధికారులతో గొడవపడ్డారు. తాము ఫిర్యాదు చేసేందుకువస్తే తమ ఫిర్యాదులు స్వీకరించడం లేదని నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్యోగుల విధులకు ఆటంకం ఏర్పడింది. పైగా ఎంపీడీవో దామోదరరావుతో వాగ్వాదం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తమ విధులకు ఆటంకం కలిగించారని..ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ అదేరోజు రాత్రి ఎంపీడీవో దామోదరరావు…రవికుమార్పై సరుబుజ్జిలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రవి కుమార్తో పాటు మరో 11 మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో కూన రవికుమార్, అంబళ్ల రాంబాబు మినహా మిగిలిన వారు స్టేషన్లో లొంగిపోవడంతో వీరందరికీ బెయిల్ మంజూరైంది. అప్పటినుంచి కూన రవికుమార్, అంబళ్ల రాంబాబులు అఙ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆగస్టు 27 నుంచి రవికుమార్ను అరెస్టు చేయడానికి పోలీసులు చాల ప్రయత్నాలు చేశారు. కానీ లాభం లేకపోయింది.
ఈ కేసులో కూన రవికుమార్ శ్రీకాకుళం జిల్లా కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించినా కోర్టు మంజూరు చేయలేదు. దీంతో నేరుగా హైకోర్టును ఆశ్రయించగా మంగళవారం బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఈ బెయిల్ పత్రాలు తీసుకుని కూన రవికుమార్ గురువారం ఆముదాలవలస కోర్టుకు హాజరుకానున్నారు.. ఈ నేపథ్యంలో కూన రవికుమార్ను మరో కేసులో అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం కావాలనే తమ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం కూన రవికుమార్ను ఒకవేళ అరెస్టు చేస్తే జిల్లా టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.