ఇక దేశం మొత్తం ఒకే ఓటర్ లిస్ట్..?

|

Aug 30, 2020 | 12:04 PM

ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను మెల్లమెల్లగా అమలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇందులో భాగంగా 2019 ఎన్నికల ఎజెండాలోని ఉమ్మడి ఓటర్‌ జాబితాపై కేంద్రం కసరత్తు మొదలు పెట్టింది. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలను ఒకే ఓటరు జాబితాతో నిర్వహించాలన్న ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది

ఇక దేశం మొత్తం ఒకే ఓటర్ లిస్ట్..?
Follow us on

ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను మెల్లమెల్లగా అమలు చేస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇందులో భాగంగా 2019 ఎన్నికల ఎజెండాలోని ఉమ్మడి ఓటర్‌ జాబితాపై కేంద్రం కసరత్తు మొదలు పెట్టింది. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక ఎన్నికలను ఒకే ఓటరు జాబితాతో నిర్వహించాలన్న ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా రూపొందిస్తుండగా, మున్సిపాలిటీ, పంచాయతీ తదితర స్థానిక ఎన్నికలకు ఆయా రాష్ట్ర ఎన్నికల సంఘాలే జాబితాలను తయారుచేస్తున్నాయి. దీంతో ఒకే పని మూడు సార్లు జరుగుతోంది. దీనివల్ల అనవసర ధన వ్యయం పెరుగుతోందని కేంద్రం భావిస్తోంది. దీంతో పాటు ఓ జాబితాలో పేరుండి.. మరో లిస్టులలో లేకపోవడం లాంటి గందరగోళ పరిస్థితులూ తలెత్తుతున్నాయి. ఇందుకు ఉమ్మడి ఓటరు జాబితాయే సరియైన పరిష్కారమని కేంద్రం భావిస్తోంది.

రాజ్యాంగం ప్రకారం.. పంచాయతీ, మున్సిపాలిటీ తదితర స్థానిక ఎన్నికలకు ఓటర్ల జాబితా తయారు చేసుకొనే అధికారం అయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలకే ఉంటుంది. అయితే, కేవలం 8 రాష్ట్రాలు మినహా అన్నీ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ఎన్నికల సంఘం జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. కాగా, కేరళ, యూపీ, ఉత్తరాఖండ్‌, ఒడిశా, అసోం, మధ్యప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, జమ్మూ కశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంతం మాత్రం రెండు విధాల ఓటర్ల లిస్టులు అందుబాటులో ఉన్నాయి. దీంతో జనంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆ 8 రాష్ట్రాలను సైతం ఒప్పించాలని ప్రధాని కార్యాలయంలో ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రాలను ఒప్పించడమే కాకుండా, మరిన్ని సమస్యలను కూడా అధిగమించవచ్చని అధికారులు అంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు అనుగుణంగా కేంద్ర జాబితా తయారు చేయాలి. డిజిటల్‌ సాంకేతికతను ఉపయోగించుకుంటే సమస్య పరిష్కారం కావచ్చని ఎన్నికల సంఘం సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.