వాహనదారులు షాక్.. పెట్రోల్ కొట్టమంటే ట్యాంకుల్లో నీళ్లు నింపారు, విజయవాడలో వాటర్ పెట్రోల్ బంక్.!

|

Dec 13, 2020 | 5:26 PM

విజయవాడలోని ఓ పెట్రోల్ బంకులో, పెట్రోల్ కి బదులు వాటర్ రావడం కలకలం రేపింది, నగరంలోని ఆటోనగర్ అరుణ శ్రీ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్న...

వాహనదారులు షాక్..  పెట్రోల్ కొట్టమంటే ట్యాంకుల్లో నీళ్లు నింపారు, విజయవాడలో వాటర్ పెట్రోల్ బంక్.!
Follow us on

విజయవాడలోని ఓ పెట్రోల్ బంకులో, పెట్రోల్ కి బదులు వాటర్ రావడం కలకలం రేపింది, నగరంలోని ఆటోనగర్ అరుణ శ్రీ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకున్న వాహనదారులకు కాసేపటికే మార్గం మధ్యలో వాహనాలు ఆగిపోవడంతో తిప్పలు పడ్డారు. మెకానిక్ దగ్గరికి వెళ్లి చెక్ చేయించగా ఆశ్చర్యానికి గురయ్యారు. బండిలో పెట్రోల్ కి బదులు వాటర్ ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. ఎం చేయాలో తెలియక, తిరిగి పెట్రోల్ బంకుకి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు. అయితే అప్పటికే జరిగిన పొరపాటును గ్రహించిన బంకు సిబ్బంది, పెట్రోల్ ను ఫిల్ చేయడం తాత్కాలికంగా నిలిపివేశారు. తప్పిదం కారణంగా ఆగిపోయిన వాహనాలను రిపేర్ చేయిస్తామని బంకు యజమాన్యం హామీ ఇవ్వడంతో వాహనదారులు కొంతవరకూ శాంతించారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ వాహనదారులు మండిపడ్డారు. అయితే, పెట్రోల్ బంకు యాజమాన్యం మాత్రం పెట్రోల్ లో ఎలాంటి నీటిని కల్తీ చేయలేదని అంటున్నారు. కంపెనీ నుండి వచ్చిన పెట్రోల్ నేరుగా ట్యాంకర్ లో నింపామని ఘటన తర్వాత వాటిని పరీక్షించగా పెట్రోల్ లో కలిపే ఇథనాల్ కలపాల్సిన శాతం కంటే ఎక్కువగా కలిసిందన్నారు. వెంటనే కంపెనీ అధికారులకు సమాచారం అందించామన్నారు. ఆగిపోయిన 25 వాహనాలను వెంటనే రిపేర్ చేయించామని తెలిపారు. కాగా, అధిక శాతం ఇథనాల్ కలవడం వలనే వాహనాలు ఆగిపోవడానికి కారణం అంటున్నారు ఆటో మొబైల్ నిపుణులు. పెట్రోల్ లో వాటర్ కలవడం సాధ్యం కాదని, ఒకవేళ కలపడానికి ప్రయత్నించిన ఇట్టే పసిగట్టవచ్చు అని అంటున్నారు. ఘటన జరిగిన వెంటనే పెట్రోల్ ట్యాంక్ లో శాంపిల్స్ పరిశీలించిన అనంతరం ఇథనాల్ వలనే సమస్య అని తేల్చారు.