SARS-CoV-2: కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్తో మృతిచెందినవారి సంఖ్య రెండు వేలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్తో దాదాపు 80 వేల మంది వరకు బాధపడుతున్నారు… వారిలో మెజార్టీగా.. అంటే 75 వేల మందికి పైగా చైనీయులు ఉన్నారు.. మిగతావారు ఇతర దేశాల్లో ఉన్నారు. అయితే, కరోనా వైరస్ ములాలు ఒక ప్రయోగశాలలోనే ఉన్నాయా? అనుమానాలు వ్యక్తం అవుతుండగా… ‘ద పాజిబుల్ ఆరిజన్స్ ఆఫ్ 2019-ఎన్సీవోవీ కరోనా వైరస్’ పేరుతో వెలువడిన ఓ వ్యాసం అవుననే సమాధానం చెబుతోంది.
దక్షిణ చైనాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు ఈ వ్యాసాన్ని రాశారు. ఆ వ్యాసం ప్రకారం.. చైనాలోని ‘వూహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’లో గబ్బిలాలపై కొంతకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయని… వైర్సకు కేంద్రస్థానంగా భావిస్తున్న వూహాన్లోని సీఫుడ్ మార్కెట్కు ఇది కేవలం 300 గజాల దూరంలో ఉంది.. ఒకరోజు ఆ కేంద్రంలోని గబ్బిలాలు అక్కడున్న పరిశోధకుడిపై దాడి చేసినట్టు పేర్కొన్నారు.. ఇక, వాటి రక్తం అతడి చర్మంపై పడిందని, వాటి మూత్రం కూడా అతడిపై పడినట్టు వెల్లడించారు. దీంతో సదరు వ్యక్తి రెండువారాలపాటు స్వయంగా క్వారంటైన్లో ఉన్నాడని చెప్పుకొచ్చారు. దీంతో.. ఇక్కడి నుంచి కరోనా వైరస్ వ్యాప్తిచెందినట్టుగా అనుమానిస్తుండగా.. దీనికి మరింత బలం చేకూరినట్టు అయ్యింది.