బీహార్లోని సంకీర్ణ ప్రభుత్వం జేడీయూ- బీజేపీల మధ్య పొరపొచ్చాలు వచ్చాయని.. బీజేపీ తీరుతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. దానికి తోడు మోదీ నేతృత్వంలో ఇటీవల ఏర్పడ్డ కేబినెట్లో జేడీయూకు ఒకే ఒక్క సీటు కేటాయించడంపై నితీష్ కుమార్ చిన్నబుచ్చుకున్నారని, దానికి ప్రతీకారంగానా..? అన్నట్లు ఇటీవల విస్తరించిన తన మంత్రివర్గంలో బీజేపీకి కేవలం ఒకే ఒక్క బెర్త్ను కేటాయించిన సంగతి తెలిసిందే(అయితే తన పార్టీకి చెందిన 8మందికి ఈ విస్తరణలో ఆయన మంత్రి పదవులు కేటాయించారు). తాజా పరిణామాలతో ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న ఆర్జేడీ.. బీజేపీకి, నితీష్ కుమార్ దూరమైన పక్షంలో జేడీయూతో తాము పొత్తుకు సిద్ధమని ప్రకటించింది. ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘువన్ష్ ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఎన్డీయే నుంచి నితీష్ కుమార్ బయటికి వచ్చేస్తే మేము స్వాగతిస్తాం. మిగిలిన పార్టీలతో ఆర్జేడీ, జేడీయూ కలిసి బీజేపీని ఓడించవచ్చునని’’ అన్నారు.
అయితే దీనిపై జేడీయూ అధికార ప్రతినిథి అజయ్ అలోక్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ‘‘ఎన్డీయేలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆర్జేడీతో పాటు మిగిలిన పార్టీలు చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి. మేము కలిసే ఉంటాం. మీ పని మీరు చూసుకోండి’’ అంటూ పేర్కొన్నారు. కాగా ఎన్డీయే ప్రభుత్వం నుంచి 2013లో బయటికొచ్చిన జేడీయూ.. 2017లో మళ్లీ జట్టు కట్టిన విషయం తెలిసిందే.