పాత పద్దతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ అధికార యంత్రాంగం..

|

Dec 21, 2020 | 5:42 AM

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం పాత పద్దతిలోనే రిజిస్ర్టేషన్లను ప్రారంభించనుంది.

పాత పద్దతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ అధికార యంత్రాంగం..
Follow us on

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం పాత పద్దతిలోనే రిజిస్ర్టేషన్లను ప్రారంభించనుంది. సోమవారం నుంచి ఈ ప్రక్రియ మొదలుకానుంది. శనివారం నుంచే స్లాట్ బుకింగ్ రద్దు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రిజిస్ట్రేషన్లు చేసేటప్పుడు ఏ విధమైన పద్దతులు పాటించాలని, అవలంభించాల్సిన విధి విధానాలను తెలియజేశారు. రద్దీ అధికంగా ఉంటే టోకెన్ సిస్టమ్ సూచించాలని తెలిపారు. డాక్యుమెంట్ల పరిశీలనలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చిరించారు.

రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. కార్డ్‌ విధానంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు అంతా సిద్ధంగా ఉండాలని యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు సమాయత్తం చేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారితో ఎలాంటి గొడవలు, వాగ్వాదాలు జరగకుండా మర్యాదగా నడుచుకోవాలని, బలమైన కారణాలు ఉంటే తప్ప కొర్రీలు వేయకుండా రిజిస్ట్రేషన్లు చేయాలని స్పష్టం చేశారు. ఎల్‌ఆర్ఎస్ లేనివాటికి రిజిస్ట్రేషన్లు జరగవని, భవన నిర్మాణ అనుమతులు ఉన్న వాటికే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని వెల్లడించారు. కాగా రిజిస్ట్రేషన్ల విధానాన్ని సమూలంగా మార్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గత సెప్టెంబర్‌ 8 నుంచి ప్రక్రియను నిలిపి వేసింది. సంస్కరణల్లో భాగంగా ధరణి వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేసి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించిన సంగతి తెలిసిందే.