మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఊహించిందే జరిగింది. జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు శనివారం అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..ఎమ్మెల్యేలకు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 21 మంది ప్రస్తుతం బీజేపీలో చేరగా, మరో ఎమ్మెల్యే అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోయారు. ఆయన మరికొద్ది రోజుల్లో బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు విధేయులుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. దీంతో కమల్నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్ను గవర్నర్ ఆదేశించడం, కమల్నాథ్ దీనిపై అభ్యంతరం చెప్తూ.. సుప్రీం మెట్లు ఎక్కడం జరిగాయి. అయితే శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు బలనిరూపణ చేసుకోవాలని ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలిచ్చింది. నాటికీయ పరిణామాల మధ్య బలపరీక్షకు ముందే కమల్నాథ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ మరోసారి అధికార పీఠం ఎక్కబోతుంది.
Delhi: Rebel Madhya Pradesh Congress MLAs meet BJP President JP Nadda & BJP leader Jyotiraditya Scindia, at JP Nadda’s residence. pic.twitter.com/FPh3AjFq8x
— ANI (@ANI) March 21, 2020