Rajasthan High Court Adjourns Hearing : రాజస్ధాన్లో రాజకీయ హైడ్రామా రంజుగా సాగుతోంది. తనతో పాటు 18 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ జారీచేసిన అనర్హత నోటీసులను సవాల్ చేస్తూ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ రాజస్ధాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే తదుపరి విచారణను (జులై 17) శుక్రవారానికి వాయిదా వేసింది కోర్టు. అనర్హత నోటీసులపై సచిన్ పైలట్ తరఫు న్యాయవాది హరీష్ సాల్వే తన వాదనలు గట్టిగా వినిపించారు.
అయితే రాజస్థాన్ రాజకీయాలను కూల్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. ఇద్దరు నేతల మధ్య నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు ఆమె ప్రయత్నాలు మొదలు పెట్టారు. చిట్టచివరి ప్రయత్నంగా పార్టీ ట్రబుల్ షూటర్ అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్లతో మంతనాలు ప్రారంభించారు.
రాజస్థాన్ కాంగ్రెస్లో నెలకొన్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ సమయానుకూలంగా పావులు కదిపేందుకు రెడీ అవుతోంది. అసెంబ్లీ వేదికగా గహ్లోత్ సర్కార్ బలపరీక్షకు సంసిద్ధం కావాలని కాషాయ నేతలు డిమాండ్ మొదలు పెట్టారు.