ఎన్‌ఆర్‌సీ అనుకూలురెవరు..? వ్యతిరేకులెవరు..?

| Edited By: Srinu

Nov 22, 2019 | 4:07 PM

ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో దూకుడుగా వ్యవహరించిన మోదీ సర్కార్‌- ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పౌరుల జాతీయ రిజిస్టర్‌ను ఏర్పాటు చేస్తామంటోంది. అంటే భారత పౌరులు ఎవరో, అక్రమ వలసదారులెవరో తేల్చేస్తామంటోంది. కానీ కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌ వంటి విపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్‌ఆర్‌సీ పేరుతో బీజేపీ మళ్లీ మతాన్ని వాడుకోవాలని చూస్తుందా అన్న అంశం తెరపైకి వస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశంలో జమ్మూకాశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఆమోదింపజేసుకున్న కేంద్రం, శీతాకాల […]

ఎన్‌ఆర్‌సీ అనుకూలురెవరు..? వ్యతిరేకులెవరు..?
Follow us on

ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో దూకుడుగా వ్యవహరించిన మోదీ సర్కార్‌- ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పౌరుల జాతీయ రిజిస్టర్‌ను ఏర్పాటు చేస్తామంటోంది. అంటే భారత పౌరులు ఎవరో, అక్రమ వలసదారులెవరో తేల్చేస్తామంటోంది. కానీ కాంగ్రెస్‌, తృణమూల్ కాంగ్రెస్‌ వంటి విపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎన్‌ఆర్‌సీ పేరుతో బీజేపీ మళ్లీ మతాన్ని వాడుకోవాలని చూస్తుందా అన్న అంశం తెరపైకి వస్తోంది.

పార్లమెంటు వర్షాకాల సమావేశంలో జమ్మూకాశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఆమోదింపజేసుకున్న కేంద్రం, శీతాకాల సమావేశాల్లో పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొస్తోంది. బీజేపీ కేంద్రంలో మళ్లీ బంపర్‌ మెజారిటీతో అధికారంలోకి రాగానే జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్‌ 370ని రద్దుచేసింది. పడక్బందీగా ఆపరేషన్‌ జమ్మూకాశ్మీర్‌ పూర్తిచేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీని ప్రవేశపెడతామంటోంది. ఇందుకోసం పౌరసత్వ సవరణ బిల్లును ఈ సెషన్‌లో ప్రవేశపెట్టాలని నిర్ణయంచింది. అయితే ఇందులో ఏ మతాలవాళ్లు భయపడాల్సిన పని లేదంటున్నారు హోంమంత్రి అమిత్‌ షా.

దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ చేపడతాం. అందులోభాగంగానే అసోంలో ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను సహజంగా మళ్లీ నిర్వహిస్తాం. ఏ మతానికి చెందినవారు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరినీ ఎన్‌ఆర్‌సీలో చేర్చే వ్యవస్థ అందుబాటులో ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అసోంలో ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ చేపట్టారు. ఒక్క అసోంలోనే 40 లక్షల మంది అక్రమ చొరబాటుదారులు ఉంటారని బీజేపీ గతంలో చెప్పుకుంది. తీరా లెక్క వేస్తే 19 లక్షల మంది మాత్రమే ఉన్నట్లు తేలింది. అయితే, అప్పట్లోనే ఈశాన్య రాష్ట్రాలుఎన్‌ఆర్‌సీని వ్యతిరేకించాయి. అయితే, దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ చేపట్టాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ కమలనాథులపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకు సమయం వచ్చిందని ఆయన వాదన.

ఈ పరిస్థితుల్లో- అమిత్‌ షా ప్రకటన వెలువడిన వెంటనే తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఆర్‌సి అమలు చేయడానికి అనుమతించేది లేదని దీదీ తేల్చేశారు. ఎన్‌ఆర్‌సీ పేరుమీద రాష్ట్రంలో అస్థిరత సృష్టించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. బెంగాల్‌లో నివసిస్తున్న ప్రజల పౌరసత్వాన్ని తొలగించి, శరణార్థులుగా ఎవరూ మార్చలేరని ఆమె భరోసా ఇచ్చారు.

అటు దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తోంది. గతనెల 25న సోనియాగాంధీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని చర్చించారు. జార్ఖండ్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఎన్‌ఆర్‌సీని బీజేపీ తెరమీదకు తెస్తున్నట్లు కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. పౌరసత్వం అనే అంశం ఆధారంగా మతాలపై వివక్ష చూపటం రాజ్యాంగ ఉల్లంఘనే అని తిప్పికొట్టాలని కాంగ్రెస్‌ దాదాపుగా నిర్ణయించింది. ఇక  ఎన్‌ఆర్‌సీ ప్రక్రియను దేశవ్యాప్తంగా విస్తరించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై సిపిఐ(ఎం) తన వ్యతిరేకతను ముందు నుంచి వ్యక్తం చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఆ పార్టీ పొలిట్‌బ్యూరో ఇప్పటికే  ప్రకటనను విడుదలజేసింది.

మొత్తం మీద బీజేపీ.. దాని అనుబంధ సంఘాలు, పార్టీలు ఎన్‌ఆర్‌సీ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుండగా..కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, లెప్ట్ పార్టీలు, ఎమ్‌ఐఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.