ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్లో మొబైల్ పోస్ట్ పెయిడ్ సర్వీస్లను పునరుద్ధరించారు. దీని ప్రకారం సోమవారం నుంచి సుమారు 40 లక్షల మొబైల్ ప్రీ పెయిడ్ సేవలు తిరిగి వాడుకలోకి వచ్చాయి. అంతా బాగుందని అనుకునే లోపే.. ఔట్గోయింగ్ కాల్స్ను టెలికాం సంస్థలు నిలిపివేశాయి. గత 72 రోజుల నుంచి సర్వీసులు లేనప్పటికీ కశ్మీరీలకు బిల్లులు పంపి.. ఔట్గోయింగ్ సేవలను కట్ చేశాయట టెలికాం సంస్థలు. అటు ఆ బిల్లులను కట్టాలని ప్రయత్నించినప్పటికీ ఇంకా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రాకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
370 అధికరణ రద్దు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆగష్టు 5 నుంచి మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఇక సోమవారం నుంచి మొబైల్ సేవలు అందుబాటులోకి రావడంతో అక్కడి ప్రజలు కాస్త ఉపశమనం చెందారు. కశ్మీర్ లోయలో దాదాపు 70 లక్షల మొబైల్ కనెక్షన్లు ఉండగా.. అందులో 40 లక్షల పోస్ట్ పెయిడ్ సర్వీసులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అటు 30 లక్షల ప్రీ-పెయిడ్ ఫోన్లు ఇంకా పునరుద్దరించాల్సి ఉంది. మరోవైపు ఇంటర్నెట్ను ఎప్పుడు ఫిక్స్ చేస్తారనే దానిపై స్పష్టత లేదు.
కశ్మీర్లోని ప్రస్తుత పరిస్థితులు బట్టి ఒక్కొక్కొటిగా ఆంక్షలను ఎత్తివేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ.. లోయలోని ప్రజలు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులూ ఫోన్ సర్వీసులు నిలిపివేశామని అన్నారు.