చిత్తూరు జిల్లాలో రెండు వేల మంది పింఛనర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. విశ్రాంత ఉద్యోగులకు ఆగస్టు 1న పింఛను అందని పరిస్థితి నెలకొంది. జనవరిలో సమర్పించాల్సిన లైఫ్ సర్టిఫికెట్లను ఇంతకు ఇవ్వకపోవడమే ఇందుకు కారణమంటున్నారు జిల్లా అధికారులు.
చిత్తూరు జిల్లావ్యాప్తంగా 18 సబ్ట్రెజరీ కార్యాలయాల పరిధిలో 29,520 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రతి నెల ఫించన్ తీసుకుంటున్నారు. వీరందరూ ఏటా నవంబర్లో లైఫ్ సర్టిఫికెట్లను సమర్పిస్తుంటారు. అయితే, ఈ ఏడాది జనవరి ఒకటోతేదీ నుంచే వీటిని అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికెట్లు నమోదైన వారికి మాత్రమే పింఛన్లు అందించాలని ప్రభుత్వం సూచించింది. గత నవంబరులోనే వీటిని ఇచ్చామని భావించిన చాలామంది పెన్షనర్లు ఈ విషయం మర్చిపోయారు. అప్పట్లో అందిన సర్టిఫికెట్ల వివరాలను సబ్ట్రెజరీ కార్యాలయ అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు పెన్షనర్లకు సజావుగానే పింఛన్లు అందాయి.
అయితే, గత ఏడాది నవంబరులో లైఫ్ సర్టిఫికెట్లు ఇచ్చి, జనవరిలో సమర్పించని పింఛనుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు జిల్లావ్యాప్తంగా 2,500మంది పింఛనుదారులకు ఆగస్టు ఒకటోతేదీ పింఛను అందని పరిస్థితి నెలకొంది. ఇదే విషయం రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ తెలిపారు. ఈనెలాఖరులోగా పింఛనుదారులు సబ్ట్రెజరీ కార్యాలయాల్లో లైఫ్ సర్టిఫికెట్లను సమర్పిస్తే ఇబ్బందులు ఉండవన్నారు. ప్రభుత్వ వెబ్సైట్లోని ఎంప్లాయీస్ సెల్ఫ్ సర్వీసులో లాగిన్ అయి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికెట్ కాలమ్లో వివరాలు నమోదు చేయవచ్చని సూచించారు. ఆగస్టు నుంచి లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తే గానీ ఫించన్ చెల్లించలేమని జిల్లా అధికారులు చెబుతున్నారు.