Pawan Kalyan questons CM Jagan: కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు తనదైన శైలిలో భారీ ఆర్థిక సాయమందించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ప్రభుత్వాల నియంత్రణా చర్యల్లో వైఫల్యాలను, లోటుపాట్లను ఎత్తిచూపారు. తగిన విధంగా చర్యలు తీసుకోకుంటే.. ఎంత ఖర్చు చేసినా ఆశించిన ఫలితం రాదన్న విషయాన్ని గుర్తించాలని ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్కు చురకలంటించారు. ఆయుధాలివ్వకుండా సైనికులను యుద్దానికి పంపినట్లే వుందని జగన్ పై సెటైర్లు వేశారు జనసేనాని.
తాను గత వారం ప్రకటించిన ఆర్థిక సాయంలో భాగంగా ప్రధాన మంత్రి కరోనా సహాయనిధికి కోటి, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు 50 లక్షల చొప్పున విరాళాన్ని పవన్ కల్యాణ్ శనివారం బ్యాంక్ ట్రాన్స్ ఫర్ ద్వారా అంద జేశారు. వాటికి సంబంధించిన వివారలను పవన్ కల్యాణ్ మీడియాకు పంపారు. ఇదే సమయంలో కరోనా నియంత్రణలో లోటుపాట్లను, లాక్ డౌన్ పీరియడ్లో తీసుకుంటున్న చర్యల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఆయన ముఖ్యమంత్రి జగన్కు తెలిపేందుకు ఓ నోట్ విడుదల చేశారు.
కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసి కూడా ఆ వైరస్ పీడితులకు, అనుమానితులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని ఎవరూ విస్మరించకూడదని పవన్ కల్యాణ్ అంటున్నారు. ‘‘ఇంట్లో ఉన్న తమ బిడ్డల్ని వదిలి వచ్చి ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.. తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చిన్నారులకు, ఎవరైనా వృద్ధులు ఉంటే వారికి ప్రమాదం అని తెలిసి కూడా వారంతా సేవలు చేస్తున్నారు.. అలాంటి వైద్యులు, సంబంధిత సిబ్బందికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ (పి.పి.ఈ.) పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడం దురదృష్టకరం.. ఆయుధాలు లేకుండా సైనికులను యుద్ధానికి పంపడం న్యాయమా? అలాగే వైద్య సిబ్బందికి అవసరమైన పి.పి.ఈ.లు ఇవ్వకుండా వైరస్ తో యుద్ధం చేయించాలనుకోవడం ధర్మం కాదు..’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కోవిడ్-19కి వైద్యం, పరీక్షలు చేసే సిబ్బంది ఏ విధమైన మెడికల్ మాస్కులు, గౌన్స్, గ్లోవ్స్, కంటి అద్దాలు/ఫేస్ షీల్డ్ ధరించాలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) నిర్దేశించిందని, అందుకు అనుగుణంగా వైద్యులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలని జనసేనాని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో వాటిని తగిన విధంగా సమకూర్చకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళనలో ఉన్నారని, ఎన్-95 మాస్కులు కూడా సమకూర్చ లేదని, సాధారణ డిస్పోజబుల్ గౌన్స్ మాత్రమే ఇస్తున్నారనే వైద్యుల మాటను ఒకసారి వినాలని ఆయన ఏపీ ముఖ్యమంత్రిని కోరారు.