Nobel Prize Winner: సాధారణంగా నోబెల్ అవార్డు గ్రహీతలు ఎవరితోనూ కలవడానికి ఇష్టపడరు. అంతేకాక స్పందించడానికి కూడా పెద్దగా సుముఖత చూపరు. ఎప్పుడూ కూడా ప్రయోగాలను చేసుకుంటూ వారి లోకంలో వారు ఉంటారు. ఇక ఇదే కోవకు జాన్ బి గుడెనఫ్ చెందినవారే. ప్రస్తుతం మన అందరం ఉపయోగించే ఫోన్లు, కెమెరాల్లోని లిథియమ్ ఇయాన్ బ్యాటరీల్లో క్యాథోడ్ ను ఆవిష్కరించింది ఈయనే. దీనికి గానూ 2019లో నోబెల్ అవార్డును అందుకున్నారు. ఇక తాజాగా ఆయన దృష్టి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ పథకంపై పడింది.
ఈ పథకంపై ఆయన తాజాగా స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు. ‘అమ్మ ఒడి’ పథకాన్ని ఎడ్యుకేషన్ విభాగం ఓవర్సీస్కు తీసుకెళ్లింది. భారత్ లాంటి దేశంలో పిల్లలను చదివించే ప్రతీ తల్లికి ఆర్ధికంగా సాయాన్ని అందించే ఈ పథకంపై, ప్రవేశపెట్టిన సీఎం వైఎస్ జగన్పై నోబెల్ అవార్డు గ్రహీత జాన్ బి గుడెనఫ్ ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికి అందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని.. ఇక ఆ దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వం కృషి అభినందనీయం అని అన్నారు.
ఇక ఇండియాలో పరిస్థితులు ఈ నోబెల్ గ్రహీతకు తెలియని కావు. మన దగ్గర నేర్చుకోవాలని తపన ఉన్నా.. ఎంతోమంది దగ్గర ఆర్ధిక శక్తి లేక వాళ్ళ పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివే అవకాశం లేకుండాపోతోంది. ఇలాంటి తరుణంలో అమ్మఒడి పథకం ఎంతోమంది పేద విద్యార్థులకు ఆసరాగా నిలుస్తుందని చెప్పవచ్చు. కాగా, జాన్ బి గుడెనఫ్ ‘అమ్మఒడి’ పథకంపై ప్రశంసలు కురిపిస్తూ ఓ మెసేజ్ను వీడియో రూపంలో విడుదల చేశారు.