మొజంజాహీ మార్కెట్‌కు పూర్వ అందాలు.. మన కోసం…

|

Aug 14, 2020 | 11:50 AM

ఎంజే మార్కెట్​ ...ఇప్పుడు వెలుగు జిలుగులతో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంది. ఈ కట్టడాన్ని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఎంజే మార్కెట్​ను ‌దత్తత తీసుకున్నారు...

మొజంజాహీ మార్కెట్‌కు పూర్వ అందాలు.. మన కోసం...
Follow us on

ప్రచీన కట్టడాలకు హైదరాబాద్ పెట్టింది పేరు. ఆధునిక హంగులతో అప్పుడెప్పుడో కట్టిన కట్టడాలు ఇంత వరకు చెక్కు చెదరలేదు. వాటి దర్పం ఇంత వరకు తగ్గలేదు. అలాంటి వాటిలో మొజంజాహీ మార్కెట్ ఒకటి. మొన్నటి వరకు రూపు కోల్పోయి అంద‌విహీనంగా ఉన్న ఎంజే మార్కెట్​ …ఇప్పుడు వెలుగు జిలుగులతో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంది. ఈ కట్టడాన్ని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ ఎంజే మార్కెట్​ను ‌దత్తత తీసుకున్నారు.
అలనాటి అందాలను తిరిగి తెచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశారు. రూ.10 కోట్లు వెచ్చించి మార్కెట్​ను సందరీకరించారు. దీంతో నూతన శోభను సంతరించుకుంది. సుందరంగా ముస్తాబైన ఎంజే మార్కెట్ పునఃప్రారంభానికి రెడీగా ఉంది.

హైదరాబాద్ నగరంలోని అద్భుత కట్టడాలు…చరిత్రకు సాక్షంగా నిలుస్తున్నాయి. అలాంటి అపురూప సంపదను పదిలంగా నేటి తరానికి అందించాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణ‌యించింది. నగరంలోని పలు కట్టాడాలను, జంక్ష‌న్​ల‌ను ఇప్పటికే ఆధునీకరించారు. అందులో భాగంగానే నాంపల్లిలోని మొజంజాహీ మార్కెట్​నూ సుందరీకరించారు.

గత చరిత్ర…

పాతబస్తీకి, కొత్త నగరానికి అందుబాటులో ఉండేలా ఎంజే మార్కెట్​ను అప్పటి పాలకులు భాగ్యనగరం మధ్యలో నిర్మించారు. అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. 1935లో చివ‌రి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ త‌న రెండో కుమారుడు న‌వాబ్ మొజంజా బ‌హ‌దూర్ పేరుతో మొజంజాహీ మార్కెట్​ను కట్టించారు. 1.77 ఎకరాల విస్తీర్ణంలో 120 దుకాణాల సముదాయంగా దీన్ని నిర్మించారు. 1947 వ‌ర‌కు ఎంజే మార్కెట్ ప్రముఖ పాన్​బ‌జార్‌గా పేరు పొందింది. ఇక్కడ దొర‌క‌ని పాన్ వెరైటీలు ఉండవంటే నమ్మండి. ఇలా కాలక్రమంగా ఎంజే మార్కెట్ కాస్తా… కూరగాయలు, మాంసం, పండ్లు, పూల దుకాణాలు, అత్తరు, స్వీట్, ఐస్ క్రీమ్ షాప్ ఇలా వివిధ రకాల ఇక్కడ వెలిశాయి.

అయితే ఇక్కడ ఉన్న పండ్ల మార్కెట్​ 1980 లో కొత్తపేట్​కు మారిపోయింది. ఆ తర్వాత 2009లో పూల మార్కెట్ గుడిమల్కాపూర్​కు తరలిపోయింది. ఇలా సామన్య ప్రజలకు కావల్సిన షాపులు ఇక్కడ లేక పోవడంతో జనం కూడా ఇక్కడికి రావడం తగ్గించారు. ఇక్కడ కేవలం అత్తర్ షాపులు, ఐస్ క్రీమ్ షాలు మాత్రమే మిగిలిపోయాయి. చరిత్ర ఘనంగానే ఉన్నా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల అంద విహీనంగా మారింది. పట్టించుకునేవారు లేక పోవడంతో అక్కడి ఇష్టారాజ్యంగా మారింది.

ఇప్పడు ఇలా…

రాత్రి వేళల్లో టూరిజం ప్రియులను ఆకర్షించేందుకు రంగు, రంగుల విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. పైన నుంచి నగరంతో పాటు… మెట్రో రైలు చూస్తూ రోజు సాయంత్రం సేద తీరేందుకు వీలుగా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మార్కెట్ పైన భారీ ఎత్తున జాతీయ పతాకం ఏర్పాటు చేశారు. మార్కెట్ 87 ఏళ్ల నిర్మాణ అనంత‌రం పుర్వ వైభ‌వం క‌లుగ‌నున్నందున చ‌రిత్ర ప్రేమికులు, న‌గ‌ర‌వాసులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా పునఃప్రారంభం కానున్న ఎంజే మార్కెట్​లోకి సాయంత్రం నుంచి ప్ర‌జ‌ల‌ను అనుమ‌తించనున్నారు.