ఆర్టికల్ 370 రద్దుపై మావోయిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది. జమ్ము కశ్మీర్ ప్రాంతానికి రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడాన్ని మావోయిస్టు పార్టీ ఖండిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు.
కశ్మీర్ ప్రజలకు అండగా ఉండాలని, ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా ఆగస్టు 15వ తేదీని “బ్లాక్ డే” గా పాటించాలని జగన్ పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, నరేంద్రమోదీ ప్రభుత్వం తమ పథకంలో భాగంగానే కొద్దిరోజుల ముందునుంచి కశ్మీర్లో సైన్యాన్ని మోహరించారని జగన్ ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దుపై కశ్మీర్లో రాజకీయ పార్టీలు తిరుగుబాటు చేయకుండా ఉండేందుకే మోహబూబా ముఫ్తీ వంటి వారిపై అవినీతి కేసులు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు. స్వయం ప్రతిపత్తి కోసం న్యాయంగా పోరాడుతున్న కశ్మీర్ ప్రజలకు అండగా మావోయిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుందని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.