కరోనా మహమ్మారిపై ముందు వరసలో ఉండి పోరాడుతున్న పోలీసులకు కష్టాలు తప్పడం లేదు. వారిపై కూడా కరోనా రక్కసి పంజా విసురుతోంది. ఇందులో సామాన్య ప్రజలతోపాటు డాక్టర్లు, పోలీసులు అధికంగా బాధితులుగా మారుతున్నారు. అయితే ఈ పోరాటంలో ఇబ్బందులు పడుతున్నవారిలో ఎక్కువ మంది పోలీసులే కావడం బాధించే సంగతి.
మహారాష్ట్రలో చాలామంది పోలీసులు కరోనా వైరస్ బారినపడి విలవిలాడుతున్నారు. గడిచిన 24 గంటల్లో 434 మంది కరోనా బారినపడగా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కారణంగా నలుగురు సిబ్బంది మృతి చెందారని ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసుశాఖలో ఇప్పటివరకు 20,801 మంది కోవిడ్-19 వైరస్ బారినపడగా 16,706 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
3,883 మంది ఆస్పత్రిలో ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నారు. ఇలా పొందుతుండగా 212 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో కరోనా ప్రభావిత రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు 10 లక్షల మందికిపైగా కరోనా బారినపడగా సుమారు 7 లక్షల మందికిపైగా కోలుకున్నారు. 3 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. అయితే ఇంత పెద్ద స్థాయిలో పోలీసులు కోవిడ్ వైరస్కు బలవుతున్నా పోలీసులు మాత్రం తమ డ్యూటీని చక్కగా నిర్వహిస్తున్నారు.