కరోనా కరాళ నృత్యం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇపుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభణ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 33 కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 781కి చేరింది. కొవిడ్-19 కారణంగా దేశంలో 109మంది మరణించగా వీరిలో అత్యధికంగా 45మంది మహారాష్ట్రలోనే చనిపోయారు. కేవలం ఒక్క ముంబయిలోనే 190పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
మరోవైపు.. పూణెలోనూ కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఢిల్లీ మర్కజ్ సమావేశం అనంతరం రాష్ట్రంలో పాజిటివ్ కేసులు సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ సమయంలో సామాజిక మాధ్యమాల్లో అసత్యవార్తలు ప్రచారం చేస్తున్న 11మందిని అరెస్టు చేశారు మహారాష్ట్ర సైబర్ క్రైం పోలీసులు. మరో 85మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడించారు. ఫేస్బుక్ తర్వాత వాట్సాప్లోనే అత్యధికంగా అసత్యప్రచారాలు చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇలా చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.