వైసీపీ నేత, బందరు ఎంపీ బాలశౌరికి ఢిల్లీలో కీలక పదవి దక్కింది. పార్లమెంట్ కమిటీల్లో అత్యంత కీలకంగా భావించే… పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(ప్రజాపద్దుల సంఘం)లో బాలశౌరి మెంబర్ గా నియామితులయ్యారు. 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నియామకం జరిగింది. ఈ మేరకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ విభాగం ఓ అనౌన్స్మెంట్ లో తెలిపింది. కాగా లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆధిర్ రంజన్ చౌదరి పబ్లిక్ అకౌంట్స్ కమిటి చైర్ పర్సన్గా నియమితులయ్యారు. ఆ కమిటీలో బాలశౌరి సభ్యుడిగా సేవలందించనున్నారు.
ప్రభుత్వ రెవెన్యూ,ఖర్చులను ఆడిట్ చేయడం పీఏసీ బాధ్యత. ప్రతిపక్షానికి చెందిన నాయకులకు ఈ పదవి ఇవ్వడం ఆనవాయితీగా ఉంటుంది. రాష్ట్రాలలో కూడా ఇదే దోరణి ఉంటుంది. పార్లమెంట్లో ప్రతిపక్షానికి చెందిన నేతను చైర్ పర్సన్గా నియమించి, ఆ కమిటీలో ఇతర పార్టీలకు చెందిన వారిని కూడా మెంబర్స్ గా నియమిస్తారు. దిగువ సభలో ఆయా పార్టీలకు ఉన్న సంఖ్యాబలం ఆధారంగా నియామకం ఉంటుంది. లోక్సభలో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ కే ఎక్కువ మంది ఎంపీలు (22) ఉన్న సంగతి తెలిసిందే.