ప్రతి భారతీయుడిలో ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యాన్ని తట్టిలేపి స్థానిక వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా స్వయంసమృద్ధి సాధించవచ్చని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆచార్య వినోబాభావే 125వ జయంతిని పురస్కరించుకుని హరిజన్ సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇంటర్నెట్ వెబినార్ వేదికగా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. భారతదేశాన్ని ఆత్మనిర్భర దేశంగా తీర్చిదిద్దేందుకు యువతలోని సామర్థ్యాన్ని ప్రోత్సహించి సరైన శిక్షణను అందించాలని అన్నారు. సమాజానికి దీర్ఘకాలంలో మేలు జరిగేందుకు చొరవ తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నదన్నారు.
Our freedom struggle was not only a political movement. It was a call for a national resurgence and socio-cultural awakening. #VinobaBhave pic.twitter.com/4eVHutIQvA
— Vice President of India (@VPSecretariat) August 27, 2020
మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడంతో పాటు, భూదాన ఉద్యమం ద్వారా సమాజంలోని అంతరాలను తగ్గించేందుకు ప్రయత్నించిన కృషీవలుడు ఆచార్య వినోబా భావే అని ఉపరాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాలకు పునర్వైభవం తీసుకురావడం ద్వారా వారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు.
మహాత్మాగాంధీకి ఆదర్శవంతమైన శిష్యుడిగా ఆచార్య వినోబాభావే చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకున్నారు. భారతీయతతోపాటు సేవ, త్యాగాలను వినోబా భావే పుణికిపుచ్చుకున్నారని చెప్పారు.