అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీ

|

Oct 14, 2020 | 2:19 PM

కృష్ణా రివర్ బోర్డు మలి సమావేశం అక్టోబర్ 28వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రతినిధులు ఈ భేటీకి హాజరై తమ తమ నీటి అవసరాలపై...

అక్టోబర్ 28న కృష్ణా రివర్ బోర్డు భేటీ
Follow us on

KRMB meeting scheduled October 28th: కృష్ణా రివర్ బోర్డు మలి సమావేశం అక్టోబర్ 28వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రతినిధులు ఈ భేటీకి హాజరై తమ తమ నీటి అవసరాలపై ఈ భేటీలో కేఆర్ఎంబీ అధికారులను ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అక్టోబర్ 28వ తేదీన కేఆర్ఎంబీ భేటీ నిర్వహించనున్నట్లు మెంబర్ సెక్రెటరీ హరికేశ్ మీనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు.

కృష్ణా డెల్టా, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కేసీకేనాల్ నీటి వినియోగంపై ఉభయ తెలుగు ప్రభుత్వాల మధ్య సయోధ్య అంశం 2019 డిసెంబర్ 17వ తేదీ నుంచి పెండింగులో వుందని హరికేశ్ మీనా తన లేఖల్లో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ ఎడమ కాల్వల నీటి వినియోగానికి సంబంధించి సయోధ్య కూడా 2019 ఏప్రిల్ 21వ తేదీ నుంచి పెండింగులో వుందని మీనా చెబుతున్నారు. ఆయా తేదీల నుంచి తెలుగు రాష్ట్రాలు వినియోగించుకున్న కృష్ణా నదీ జలాలకు సంబంధించి సమావేశంలో రాటిఫై జరగాల్సి వుందని పేర్కొన్నారు మీనా.

అయితే, రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా నదీజలాల వినియోగంలో ఎవరికి అనుకూలంగా వారు వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన నీటి వినియోగాన్ని కేఆర్ఎంబీ సమావేశం రాటిఫై చేయడం ఏ మేరకు సాధ్యమవుతుందన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. దానికి తోడు పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విత్‌డ్రా చేసుకుంటున్న ఏపీ వైఖరిని తెలంగాణ తప్పుపడుతోంది. చెబుతున్న దానికంటే ఎక్కువ నీటిని పోతిరెడ్డిపాడు గుండా రాయలసీమకు తరలిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అదే సమయంలో క‌ృష్ణా నదీ నుంచి అనధికారికంగా ఎత్తిపోతలు నిర్మిస్తున్న తెలంగాణ ప్రభుత్వం లెక్కకు మించి నీటిని తరలిస్తోందని ఏపీ ఆరోపిస్తోంది. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో జరగనున్న కేఆర్ఎంబీ భేటీ ఏ మేరకు సత్ఫలితాలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Also read: కోలుకున్న గేల్.. బెంగళూరుతో మ్యాచ్‌కు రెడీ

Also read: నవంబర్ 9న రాజ్యసభ ఎన్నికలు