ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కేసీఆర్ కీలక ఆదేశాలు.. రంగంలోకి దిగిన మంత్రివర్గ ఉపసంఘం..త్వరలో కొత్త సిస్టమ్

|

Dec 13, 2020 | 5:13 PM

తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రివర్గ ఉపసంఘం రంగంలోకి దిగింది. ఉపసంఘం ఇచ్చే నివేదికతో త్వరలో కొత్త సిస్టమ్ ప్రకారం రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.

ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కేసీఆర్ కీలక ఆదేశాలు.. రంగంలోకి దిగిన మంత్రివర్గ ఉపసంఘం..త్వరలో కొత్త సిస్టమ్
Follow us on

KCR crucial orders on registrations: అవినీతికి ఆస్కారం లేకుండా.. ప్రజలకు లంచాలు ఇచ్చే దుస్థితి పట్టకుండా.. ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా, అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం ఆర్ అండ్ బి, గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘాన్ని కేసీఆర్ నియమించారు. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌లను సభ్యులుగా నిర్ధారించారు.

ALSO READ: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. స్వయంగా వెల్లడించిన సీఎం కేసీఆర్

మూడు, నాలుగు రోజుల పాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సమావేశమై, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అనుసరించాల్సిన విధానాన్ని ఖరారు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘాన్ని కేసీఆర్ ఆదేశించారు. వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అనుసరించాల్సిన పద్ధతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు కెటి రామారావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంఓ కార్యదర్శులు శేషాద్రి, స్మిత సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మీ సేవా కమిషనర్ జిటి వెంకటేశ్వర్ రావు, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న అభిప్రాయ సేకరణ.. గ్రూపులుగా మారిన టీపీసీసీ రేసు గుర్రాలు

ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్న సమస్యలను అధిగమిస్తూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చాలా బాగా జరుగుతున్నదని, రైతులు చాలా సులభంగా, సంతోషంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయేతర భూముల విషయంలో కూడా అలాంటి విధానమే రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ‘‘ వివిధ కారణాల వల్ల 70-80 రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఇబ్బందులు తలెత్తాయి. ఇంకా జాప్యం కావద్దు. అన్ని సమస్యలు తొలగిపోయి సులభంగా, సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం రావాలి. హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా వైభవంగా సాగుతున్నది. దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరింత మెరుగ్గా సాగడానికి వీలుగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉండాలి. ప్రజలకు లేనిపోని కొత్త ఇబ్బందులు రావద్దు. ప్రజలు ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రావద్దు. ఏ అధికారి కూడా తన విచక్షణను ఉపయోగించి నిర్ణయాలు తీసుకునే వీలు ఉండవద్దు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఇతర వర్గాలను సంప్రదించి, వారి అభిప్రాయాలు తీసుకుని మంచి విధానం తీసుకురావాలి. మంత్రి వర్గ ఉపసంఘం అందరితో చర్చించాలి ’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నా.. త్వరలోనే సమగ్రమైన కొత్త విధానంతో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు.

ALSO READ: గజపతుల కోట టీడీపీలో ముసలం.. రాజావారికి చెక్ పెడుతున్న పార్టీ నేతలు