ఈ ఏడాది బతుకమ్మ పండుగను భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, సాంస్కృతిక, పర్యాటక, మత్స్య, అగ్నిమాపక శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు బతుకమ్మ పండుగ బ్రోచర్ను విడుదల చేశారు.సమావేశంలో టూరిజం సెక్రటరీ పార్థసారథి, ఇతర ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసుల అధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ… ప్రపంచంలోనే ప్రకృతిని పూజించే పండగ బతుకమ్మ. తెలంగాణది ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి అని తెలిపారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను కాపాడుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున కృషి చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మను దేశ, విదేశాల్లో జరుపుకున్నారు. సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ముంబై, బెంగళూరు, కర్ణాటకలో ఘనంగా బతుకమ్మ జరుపుకుంటున్నారు. ఈ నెల 28న వరంగల్ భద్రకాళి ఆలయంలో 10 వేల మంది మహిళలతో ఘనంగా బతుకమ్మం పండుగ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో, రాజ్భవన్, తెలంగాణ అసెంబ్లీలోనూ ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తాం… చివరి రోజు ఎల్బీస్టేడియం నుంచి ట్యాంక్బండ్ వరకు ర్యాలీ ఉంటుంది. ముగింపు వేడుకలు ట్యాంక్బండ్లో జరుగుతాయని వివరించారు.