రామతీర్థం దేవాలయంలో విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించి పార్టీ తరపున పోరాడేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ ఒక కమిటీ ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కమిటీ సభ్యులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పాలవలస యశస్విని, ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు గడసాల అప్పారావు, డాక్టర్ బొడ్డిపల్లి రఘుని పవన్ కళ్యాణ్ నియమించారు. రామతీర్థంలో స్వామికి అపచారం జరిగి వారాలు గుడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదని ఈ సందర్భంగా జనసేన విమర్శించింది. ఈ కేసులో సత్వర న్యాయం జరిగేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బృందంతో కలిసి ఈ కమిటీ పని చేస్తుందని చెప్పింది. జనసేన కార్యకర్తలను అవసరమైన సమయాలలో సమాయత్తం చేస్తూ, బీజేపీతో సమన్వయం చేసుకుంటూ ఈ కమిటీ పని చేస్తుందని పార్టీ ప్రకటనలో పేర్కొంది.