ఏపీలో ఇసుక కొరతపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ విజయవంతమైనది. పవన్ కళ్యాణ్తో పాటు పలువురు విపక్ష పార్టీల నేతలు ఈ కవాతులో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే లాంగ్ మార్చ్ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో జగన్ సర్కార్పై సేనాని నిప్పులు చెరిగారు. ఇప్పటివరకు 36 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోయారని.. వారి కుటుంబాలు రోడ్డున పడడానికి ప్రభుత్వమే కారణమని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా సీఎం జగన్కు రెండు వారాల డెడ్ లైన్ విధించిన పవన్ కళ్యాణ్… ఆలోపు భవన కార్మికులు ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇవ్వాలని.. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ డెడ్లైన్ లోపు ప్రభుత్వం స్పందించకపోతే అమరావతి వీధుల్లో నడిచి నిరసన వ్యక్తం చేస్తానని.. పోలీసులను పెట్టుకున్నా.. ఆర్మీని పిలిపించుకున్నా.. ఎవరు ఆపుతారో చూస్తామని హెచ్చరించారు. కూల్చివేతలతో మొదలుపెట్టిన వైసీపీ ప్రభుత్వం కూడా కూలిపోతుందని సేనాని ధ్వజమెత్తారు. అటు విజయసాయిరెడ్డిపై కూడా విమర్శలు చేసిన పవన్.. పరిధి దాటితే తాట తీస్తానంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. కాగా, తమ డిమాండ్లను రెండు వారాల్లో పూర్తి చేయకపోతే.. తమ భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. అటు తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల కోసం విపక్షాలన్నీ ఒకతాటి మీదకు వచ్చాయని.. ఏపీలో భవన నిర్మాణ కార్మికుల కోసం కూడా అఖిలపక్షం కదిలిరావాలని సూచించారు. మరి జనసేనాని విధించిన డెడ్లైన్కు జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.