Jagan crucial comments on corona effect: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలపై కరోనా ఎలాంటి ప్రభావం చూపించింది? ఈ విషయంలో ఆసక్తికరమైన కామెంట్లు చేశారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. కరోనా వైరస్ నియంత్రణ అదుపులో వుంది అనుకుంటున్న తరుణంలో తబ్లిఘి జమాత్ సదస్సుకు వెళ్ళి వచ్చిన వారికి పెద్ద సంఖ్యలో వైరస్ సోకడం షాకిచ్చిందన్నారు ముఖ్యమంత్రి. అదే సమయంలో ఏపీపై కరోనా ప్రభావం ఎలా వుందీ అని అడిగితే ఆసక్తికరమైన కామెంట్లు చేశారు సీఎం.
బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. కరోనా ప్రభావంతో ఏపీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని ఆయనన్నారు. అయితే.. దీనికి తమ ప్రభుత్వం ఎలాంటి భయాందోళన చెందడం లేదని, అత్యవసర పరిస్థితి తొలగిపోయిన తర్వాత పరిస్థితిని చక్కదిద్దుతామన్న ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం పెద్దగా లేదన్న ధీమాలో వున్నప్పుడు తబ్లిఘీ జమాత్ సదస్సుకు వెళ్ళి వచ్చిన వారి వల్లనే వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందిందని ఆయనన్నారు. అయితే.. దీనికి పెద్దగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
కరోనా ఎవరికి సోకినా.. ఎవరికైనా అనుమానం వున్నా.. వెంటనే 104కు కాల్ చేసి వైద్యం పొందాలని, 80 శాతం పాజిటివ్ కేసులను ఇంటి వద్ద వైద్యంతోనే నెగెటివ్ చేయొచ్చని జగన్ అన్నారు. అదే సమయంలో ఐసొలేషన్ వార్డులు, క్వారెంటైన్ సెంటర్లు, వెంటిలేటర్లు సిద్దం చేసి వున్నామని, ఎవరికైనా ప్రాణం మీదికి వస్తే వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం రెడీగా వుందని చెప్పారు జగన్. ఢిల్లీ సదస్సుకు వెళ్ళి వచ్చిన వారు స్వచ్ఛందంగా 104కు ఫోన్ చేసి, పరీక్షలకు రావాలని సూచించారు సీఎం.
లాక్ డౌన్ పీరియడ్లో జనం ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు నిర్దేశించిన సమయాల్లో బయటికి వచ్చి కావాల్సినవి కొనుగోలు చేయొచ్చని, అయితే సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ వాడడం మరువవద్దని జగన్ చెప్పారు. పెద్దగా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాగని పూర్తిగా నిర్లక్ష్యం వహించాల్సిన అవసరం కూడా లేదని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. రైతులు తమ దిగుబడులను విక్రయించుకునేందుకు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తగు ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు జగన్.
జ్వరం కంటే కాస్త డేంజర్ అంతే..
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం బాధ కలిగించిందని అన్నారు ముఖ్యమంత్రి. కరోనాతో ఎలాంటి ఆందోళన వద్దని.. ఇది జ్వరం, ఫ్లూ లాంటిదే అని చెప్పారు. జ్వరం వస్తే నయమైనట్లే ఇది కూడా నయమవుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. వయసు పైబడిన వాళ్లతో పాటు కిడ్నీ, బీపీ, షుగర్లాంటి వ్యాధులు ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు. కరోనా వైరస్ సోకితే పాపంగానో, తప్పుగానో దయచేసి చూడొద్దని ప్రజలకు జగన్ విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ వెళ్లొచ్చిన వారి వల్ల అనేక మందికి కరోనా వైరస్ సోకిందని చెప్పారు. నిజాముద్దీన్ వెళ్లిన ప్రతి ఒక్కరినీ, వారిని కలిసిన వారినీ గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరికి బాగోలేకపోయినా స్థానిక ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. గ్రామవాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది ఎవరొచ్చినా వారికి చెప్పండని అభ్యర్థించారు. అలాంటి వారికి సంబంధిత పరీక్షలు చేయడమే కాకుండా నయం కావడానికి అవసరమైన మందులు ఇస్తారన్నారు జగన్. ఆరోగ్యం విషమిస్తే నేరుగా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తారని చెప్పారు.