India Vs Australia 2020: అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో టీమిండియా ఘోర పరాభవాన్ని చవి చూసింది. ఈ ఓటమితో కోహ్లీ కెప్టెన్సీలో భారత్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 26 నుంచి జరగబోయే బాక్సింగ్ డే టెస్టు కోసం ఇరు జట్లూ ప్రాక్టీస్ సెషన్స్ మొదలు పెట్టాయి. సిరీస్లో నిలవాలంటే రెండో టెస్టులో తప్పనిసరిగా విజయం సాధించాలి.
అయితే బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా గెలవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత తేలిక కాదు. ఒకవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ పెటర్నటీ లీవ్పై స్వదేశానికి పయనం కాగా.. మరోవైపు పేసర్ మహమ్మద్ షమీ గాయం కారణంగా మిగతా టెస్ట్ మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టుకు టీమిండియా భారీ మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టుకు దూరం కావడంతో.. అతడి స్థానంలో అజింక్యా రహానే సారధ్య బాధ్యతలను చేపట్టనుండగా… ఇక అతడి ప్లేస్ను కేఎల్ రాహుల్ భర్తీ చేయనున్నాడు. అలాగే మొదటి టెస్టు రెండు ఇన్నింగ్స్ల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్ పృథ్వీ షా స్థానంలో శుభ్మాన్ గిల్, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు బదులుగా రిషబ్ పంత్, షమీ స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.!