Increased Cold: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. సాధారణం నుంచి 3 నుంచి 4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలు అయినా పొగ మంచు వీడటం లేదు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలాఉంటే రాబోయే మూడు నాలుగు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.
రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపారు. అటు ఏజెన్సీలోనూ ఉష్ణోగ్రతలు వీపరీతంగా పడిపోయాయి. చలికి ఏజెన్సీ మండలాలు గజగజ వణికిపోతున్నాయి. దీనికి తోడు పలు గ్రామాలను పొగ మంచు కమ్మేస్తోంది. ఉదయం 9 గంటలు దాటితే గాని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి సాహసించడం లేదు. గ్రామాల్లో ఇళ్ల ముందు నెగళ్లు ఏర్పాటు చేసుకుని చలి నుంచి నుంచి ఉపశమనం పొందుతున్నారు. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.