కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలన్ని లాక్డౌన్ విధించాయి. లాక్డౌన్తో అన్ని షాపులతో పాటు మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. ఐతే కొందరు అక్రమార్కులు లాక్డౌన్ను క్యాష్ చేసుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్లో మూడింతల అధిక ధరకు మద్యం అమ్ముతూ డబ్బు వెనకేసుకుంటున్నారు. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మద్యం షాపులకు ఎక్సైజ్ అధికారులు సీల్ వేసినప్పటికీ.. అక్రమ మార్గాల్లో మద్యం తరలించి గుట్టుగా అమ్మకాలు సాగిస్తున్నారు.
వివరాల్లోకెళితే.. ఖమ్మంలో భారీ మొత్తంలో మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 43 బాటిళ్ల పలు బ్రాండ్లకు చెందిన మద్యాన్ని సీజ్ చేసి.. కేసు నమోదు చేశారు ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ రెస్ట్ ఇన్ హోటల్ పక్క వీధిలో అక్రమంగా మద్యం బాటిల్స్ను నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారం రావడంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 43 బ్లాక్ లేబుల్, వైట్ లేబుల్, రెడ్ లేబుల్, 100 పైపెర్స్, బ్లాక్ డాగ్, అమృత్ అల్గామ్ మొదలైన మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకొని, ఓ కారును సీజ్ చేశారు.
కాగా.. కారు డ్రైవర్ను అదుపుచేసి రెస్ట్ ఇన్ మేనేజింగ్ డైరెక్టర్ పై కేసు నమోదు చేశారు. పట్టుబడిన మద్యం 13 వ నెంబర్ దుకాణానికి చెందినదిగా బాటిల్స్ స్కాన్ ద్వారా గుర్తించారు.