రాప్తాడు జనసేన సాకే పవన్ కుమార్ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఊ..అంటే వైసీపీ నేతల తలలు నరకుతా అంటూ తీవ్ర పదజాలంతో మాట్లాడారు. పవన్ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా పవన్ ఈ రోజు మదనలపల్లిలో ఉండి…అనంతపురం జిల్లాకు చెందిన నేతలందరితోనూ సమావేశం అవుతూ ఉన్నారు. అనంతపురం జిల్లా నుంచి గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్లోనే ముగ్గురు లీడర్స్ ప్రసంగించిన తర్వాత స్టేజ్పైకి వచ్చిన సాకే పవన్ కుమార్ ఆవేశంతో ఊగిపోయారు. అధినేత చెప్పడం వల్ల సైలెంట్గా ఉంటున్నామని, ఆయన ఆదేశిస్తే..రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి తలే కాదు, ఏ రెడ్డి తలైనా తీసేస్తా అంటూ తీవ్ర కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. మేము రెడీ, మీరు రెడీనా అంటూ సవాల్ విసిరారు జనసేన నేత సాకే పవన్ కుమార్.
రాప్తాడుకు రండి..రెడీగా ఉన్నాం : తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి
అసలు సాకే పవన్ కుమార్ అనే వ్యక్తి ఎవరో తమకు తెలియదని రాప్తాడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. స్థాయికి తగ్గ వాళ్లకి పవన్ మైకులు ఇచ్చి మాట్లాడిస్తే బెటరన్న ప్రకాశ్ రెడ్డి..పవన్ కళ్యాణ్ కులాల రాజకీయానికి దిగారని ఆరోపించారు. ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేళాపన చేయిస్తే..ప్రజలే బుద్ది చెబుతారని, తన పేరు వాడితే మైలేజ్ వస్తుందనే ఇలా దిగజారి రాజకీయాలు చేస్తున్నారని ప్రకాశ్ రెడ్డి తెలిపారు. తెలుగుదేశం స్క్రిప్ట్ను పవన్ చదువుతున్నారని, జనసేన అధినేత ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వని పక్షంలో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు.
స్పందించిన పవన్ :
వైసీపీ నేతల తలలు నరుకుతానన్న జనసేన నేత కామెంట్స్ని పవన్ కళ్యాణ్ సమర్ధించారు. ఎంతో ఆవేదన చెందాడు కాబట్టే తమ నాయకుడు ఆ మాట అన్నాడని…ఎన్నోసార్లు రాప్తాడు నేతలు తమ వాళ్లని బెదిరించారని పవన్ పేర్కొన్నారు. తలలు తీస్తానని ఆంటే కేసులు పెడతారా అని ప్రశ్నించిన పవన్.. అప్పట్లో వైసీపీవాళ్లు గత ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉరి తీయాలన్నారని, ఆ వ్యాఖ్యలపై ఎందుకు కేసులు పెట్టలేదని పవన్ ప్రశ్నించారు.
ఆరా తీసిన డీజీపీ :
సాకే పవన్ వ్యాఖ్యలపై ఏపీ డీజీపీ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. కులాల మధ్య, రాజకీయ వర్గాల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టేలా ఉన్న సాకే పవన్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారించే అవకాశం ఉన్నట్టు పోలీసు వర్గాల నుంచి అందుతోన్న వినికిడి.
టీవీ9 ఫుటేజ్ తీసుకోవాలని పోలీసులను డీజీపీ ఆదేశించినట్టు సమాచారం.