భారత అమ్ములపొదిలోకి మరో యుద్ధం విమానం చేరింది. అత్యంత అధునాతనమైన ఫైటర్ జెట్ అయిన రాఫేల్ను.. భారత వాయుసేన శుక్రవారం అందుకుంది. ఫ్రాన్స్లో పర్యటిస్తున్న డిప్యూటీ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ.. ఈ రాఫెల్ యుద్ధ విమానాన్ని డసల్ట్ ఏవియేషన్ సంస్థ చేతుల నుంచి అందుకున్నారు. అంతేకాదు ఏకంగా ఓ గంట పాటు ఆ యుద్ధ విమానంలో ప్రయాణించారు కూడా. ఇక ఈ తొలి రాఫెల్ యుద్ధ విమానం టెయిల్ నెంబర్ ఆర్బీ-01 అని ఇచ్చారు. ఆర్బీ అంటే ఎయిర్మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా పేరు వచ్చేలా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా, కొత్త ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్గా నియమితులైన విషయం తెలిసిందే. ఈ నెల 30న అధికారికంగా పదవిని చేపట్టబోతున్నారు.
రాఫెల్ జెట్ యుద్ధ విమానాల ఒప్పందంలో భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య భదౌరియా కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు యుద్ధవిమానంను నడిపిన తొలి ఐఏఎఫ్ బృందంలో భదౌరియా కూడా ఒకరుగా ఉన్నారు. అయితే ఈ రాఫెల్ ఫైటర్ జెట్ అక్టోబరు 8న ఫ్రాన్స్ అధికారికంగా భారత్కు అప్పగించనుంది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రాఫెల్ జెట్ ఫైటర్ను అందుకోనున్నారు. అయిత అక్టోబర్ 8వ తేదీనే తీసుకోడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అదే రోజు భారత్ ఎయిర్ ఫోర్స్ డే. మరోవైపు ఈ ఏడాది విజయ దశమి దసర కూడా కలిసొచ్చింది. దీంతో అధికారులు అదే రోజు రాఫెల్ తీసుకునేందుకు సుముఖత చూపడంతో.. అక్టోబర్ 8న అందుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్తో పాటుగా రక్షణశాఖ కార్యదర్శి అజయ్ కుమార్, ఇతర సీనియర్ నేతలు కూడా రాఫెల్ అందుకునే కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
అయితే మన దేశానికి మాత్రం ఇవి వచ్చే ఏడాది మే నెలలో మాత్రమే ఈ రాఫెల్ యుద్ధ విమానాలు చేరుకుంటాయి. అప్పటిలోగా దీని పనితీరు, వినియోగంపై పైలట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే రాఫెల్ యుద్ధవిమానంను నడపడంలో కొంతమంది పైలట్లు శిక్షణ పొందారు. మొత్తంగా మే 2020 నాటికి 24 మంది పైలట్లకు మూడు బృందాలుగా విడగొట్టి శిక్షణ ఇవ్వనుంది. రాఫెల్ యుద్ధ విమానాలను ఒక స్క్వాడ్రాన్ను హర్యానాలోని అంబాలా ఎయిర్బేస్లో ఉంచుతుంది. మరో స్క్వాడ్రాన్ యుద్ధవిమానాలను పశ్చిమ బెంగాల్లోని హషిమరా ఎయిర్బేస్లో ఉంచుతుంది. సెప్టెంబర్ 2016లో భారత్ ఫ్రాన్స్ ప్రభుత్వంల మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం జరిగింది. దీని విలువ రూ.60000 కోట్లు. ఇంత పెద్ద ఒప్పందం కావడంతో.. సార్వత్రిక ఎన్నికల ముందు దేశ వ్యాప్తంగా రాఫెల్ రగడ కొనసాగింది. ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రచార అస్త్రంగా మార్చుకుని బీజేపీని టార్గెట్ చేసింది. అయితే ఈ ఒప్పందంపై ఏకంగా డసల్ట్ ఏవియేషన్ సంస్థ కూడా కాంట్రాక్ట్ గురించి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి ఎన్నో వివాదాల తర్వాత రాఫెల్ భారత వాయుసేన చేతిలోకి చేరింది.
Indian Air Force (IAF) Sources: IAF received its first ‘acceptance’ Rafale combat aircraft from Dassault Aviation in France, yesterday. Deputy Air Force Chief Air Marshal VR Chaudhary also flew in the aircraft for around one hour. (file pic) pic.twitter.com/bzm0gwuVWd
— ANI (@ANI) September 20, 2019