వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం హెచ్చరిక జారీ చేశారు. వాట్సాప్ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను పెడితే ఆ గ్రూపు అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అంజనీకుమార్ హెచ్చరించారు. ఇతర దేశాల్లో జరిగిన హింసాకాండకు చెందిన వీడియోలను కొందరు వాట్సాప్ గ్రూపులో పెడుతున్నారని, దీనివల్ల నగరంలో శాంతిభద్రతల పరిస్థితికి భంగం వాటిల్లే అవకాశముందని కమిషనర్ తెలిపారు. పలు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకు హబ్ అయిన హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని సీపీ అంజనీ కుమార్ వివరించారు. వాట్సాప్ వీడియోలు, సందేశాలపై పోలీసు నిఘా వేసిందని కమిషనర్ వివరించారు.