ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి. అఖరిరౌండ్ వరకు ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతుందనే విశ్లేషణలన్నీ తుస్సుమన్నాయ్. హుజూర్నగర్ ఉప ఎన్నికలో కారు దూసుకెళ్లింది. మొదటి రౌండ్ నుంచి చివరి వరకు గులాబీ పార్టీ రికార్డు స్థాయి మెజార్టీతో సీటును సొంతం చేసుకుంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన సైదిరెడ్డిపై జనాల్లో సానుభూతి పెరగడం, ముఖ్యంగా అతను స్థానికుడు కావడం, నియోజకవర్గం సమస్యలు పూర్తి అవగాహన ఉండడం.. అందులోనూ అధికార పార్టీ అభ్యర్థి కావడంతో సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్న ఆలోచన…. ఇవన్నీ కలిసి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో… కారు జోరు తగ్గుతోందన్న భావనలో ఉన్న ప్రతిపక్షాల భ్రమలను హుజూర్నగర్ ఉప ఎన్నిక ఫలితం తొలగించిందని చెప్పాలి.
ఇదిలా ఉండగా హుజుర్ నగర్ ఫలితం ఒక్క ప్రతిపక్షాలకు మాత్రమే షాక్ ఇవ్వలేదు.. సొంత పార్టీలో ఉన్న కొందరికి కూడా షాక్ ఇచ్చింది. ఇక అదే ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఆ మధ్య ఎప్పుడూ లేని విధంగా గులాబీ గూటిలో కొంత అసమ్మతి గళం వినిపించిన సంగతి తెలిసిందే. పార్టీలో కొందరు పెద్ద నేతలే అసమ్మతి రాగం వినిపించారు. పార్టీ ఏ ఒక్కరి సొత్తో కాదని… గులాబీ జెండాలకు తామూ ఓనర్లమేనని ఘాటు వ్యాఖ్యలే చేశారు. కేబినెట్ విస్తరణ సమయంలోనూ కొందరికి పదవులు దక్కకపోవడంతో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా వరుస పెట్టి నిరసన గళాలు వినిపించారు. ఈ అసంతృప్తి జ్వాలలో పార్టీలో నివురుగప్పిన నిప్పులా మారాయి. కానీ ఒకే ఒక్క ఫలితంతో ఈ జ్వాలలన్నీ చల్లబడ్డాయి. హుజుర్ నగర్ గెలుపు తర్వాత ఆ నోర్లన్నీ మూతపడ్డాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.