కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించడంతో పాటు రెడ్జోన్లో ఉన్న కర్నూలుకు వెళ్లి వచ్చిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్రెడ్డిని అధికారులు హోం క్వారంటైన్ చేశారు. ఈ మేరకు ఆయన ఇంటికి బుధవారం నోటీసును అంటించారు. 28 రోజుల పాటు గృహ నిర్భంధంలో ఉండాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
కాగా నోటీసులిచ్చేందుకు అధికారులు వెళ్లిన సమయంలో విష్ణువర్ధన్రెడ్డి ఇంట్లో ఉండి కూడా.. లేనని చెప్పించడంతో నోటీసు గోడకు అతికించాల్సి వచ్చిందని కదిరి తహసీల్దార్ మారుతి తెలిపారు. ఇక నోటీసు ధిక్కరించి…గృహ నిర్భంధంలో ఉండకుండా బయటకు వెళ్లాలని ప్రయత్నిస్తే ఆయనపై కేసు నమోదు చేస్తామని టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. రెడ్జోన్ కర్నూలు నుంచి వచ్చినందున ఆయనకు కోవిడ్-19 టెస్టులు కూడా నిర్వహించాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు.