High court give green signal for murder movie: సమాజంలో జరిగే యధార్థ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సిద్ధహస్తుడు. తన సినిమాలను ఎప్పుడూ కాంట్రవర్సీల చుట్టూ ఉండేలా చూసుకునే వర్మ ఫ్రీగా పబ్లిసిటీ పొందుతుంటాడు. తాజాగా ఈ క్రమంలోనే మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య నేపథ్యంలో ‘మర్డర్’ అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా పేరు ప్రకటించిన నాటి నుంచి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. తమ అనుమతి లేకుండా వర్మ ఈ సినిమాలో తన జీవితంలో జరిగిన సంఘటనలను చూపిస్తున్నాడని సినిమా ప్రచారాన్ని ఆపేయాలంటూ.. ప్రణయ్ భార్య అమృత నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే వర్మ వాదనలు విన్న కోర్టు సినిమాపై ఉన్న స్టేను ఎత్తేసింది.
ఇదిలా ఉంటే మర్డర్ చిత్రం గురువారం విడుదలవుతోన్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కోరుతూ అమృత.. హైకోర్టు మెట్లు ఎక్కింది. సినిమా విడుదలను ఆపాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ను విచారించాలని హైకోర్టును కోరింది. అయితే.. అమృత కోరిన పిటిషన్ను విచారణకు స్వీకరించేందకు కోర్టు నిరాకరించింది. దీంతో గురువారం ‘మర్డర్’ సినిమా విడుదలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలిగాయి. మరి ఎట్టకేలకు విడుదలవుతోన్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే మంగళవారం ఈ చిత్ర ప్రివ్యూను ప్రదర్శించిన విషయం తెలిసిందే.