ఉత్తరాదిన వానలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా మధ్యప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్న రీతిలో 7 గంటలకు పైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వానకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.రోడ్లపైకి వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సత్నా జిల్లాలోని భారీ వర్షాలతో నాగాడ్ పట్టణం మునిగిపోయింది. నాగోడ్ పోలీస్ స్టేషన్లోకి వరదనీరు పోటెత్తింది. స్టేషన్ కాంపౌండ్లో నిలిపిన వాహనాలు పూర్తిగా నీట మునిగాయి. స్టేషన్లోని డాక్సుమెంట్స్ అన్నీ తడిసిముద్దయ్యాయి.
మరోవైపు, రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని..రేవా, సత్నా, ఛతర్పూర్, దామో , అలీరాజ్పూర్,జబల్పూర్, సాగర్, సిధి ఉమారియా సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనాతో పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. రానున్న 24 గంటలు చాలా ముఖ్యమని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.