Rayalaseema Rains : ఆంధ్రాలోని రాయలసీమ ప్రాంతంలో కరువు, కాటకాలు అధికంగా ఉంటాయి. ఎప్పుడూ లోటు వర్షపాతం నమోదవుతుంది. పంటలు సరిగ్గా పండవు. అందుకే అక్కడి ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటారు. కానీ ఈ ఏడాది సీమలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతోంది. ఇప్పటికే కురిసిన వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటివరకు కురిసిన వర్షపాతాన్ని ఒకసారి పరిశీలిస్తే.. సాధారణం కంటే అనంతపురం జిల్లాలో 109.1%, చిత్తూరులో 107.9%, కర్నూలులో 100.6%, కడపలో 53% చొప్పున అధిక వర్షపాతం నమోదైంది.
మొత్తం మీద రాయలసీమలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల వరకూ సాధారణం కన్నా 40.3% అధిక వర్షపాతం నమోదైంది. దీంతో అక్కడ ప్రధానంగా వేసే వేరుసెనగ పంట ఏపుగా పెరుగుతోంది. కాకపోతే రైతులకు కలుపు ప్రధాన సమస్యగా మారింది. కర్నూలు జిల్లాలో పత్తికొండ, ఆస్పిరి, ఆలూరు, హాళహర్వి ప్రాంతాల్లో పత్తి పొలాల్లో తడి ఆరకపోవడంతో అరకలు నడవడం లేదు.
ఇక వచ్చే రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణం కేంద్రం డైరెక్టర్ స్టెల్లా వెల్లడించారు.
Read More : ఎన్ఆర్ఐ సంబంధం..పెళ్లైన మూడు రోజుల్లోనే వరుడు ‘గే’ అని తెలిసి…