మిస్సింగ్ కేసుల మిస్టరీ.. తేలేనా..?

| Edited By:

May 01, 2019 | 5:18 PM

శ్రావణి.. మనీషా.. కల్పన.. ఎవరు వీళ్లంతా..? హాజీపూర్‌ హారర్‌లో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన లేత వయసులోని వారే. వీరే కాదు ప్రతి ఏటా రాష్ట్రంలో ఎంతోమంది పిల్లలు.. ముఖ్యంగా ఆడపిల్లలు అదృశ్యమౌతున్నారు. పోలీస్ స్టేషన్‌లకు చేరుతున్న మిస్సింగ్ కేసులెన్నో. తల్లిదండ్రుల, పోలీసుల బాద్యతారాహిత్యమో..? మృగాళ్ల అమానుషమో..? ఈ అభం శుభం తెలియని అమాయకురాళ్లు నరమేధంలో సమిధలుగా మిగులుతున్నాయి. 2017సంవత్సరంలో రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లల్లో ఇంకా 681మంది ఆచూకీ లభించలేదంటే మన వ్యవస్థ ఎంత […]

మిస్సింగ్ కేసుల మిస్టరీ.. తేలేనా..?
Follow us on

శ్రావణి.. మనీషా.. కల్పన.. ఎవరు వీళ్లంతా..? హాజీపూర్‌ హారర్‌లో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన లేత వయసులోని వారే. వీరే కాదు ప్రతి ఏటా రాష్ట్రంలో ఎంతోమంది పిల్లలు.. ముఖ్యంగా ఆడపిల్లలు అదృశ్యమౌతున్నారు. పోలీస్ స్టేషన్‌లకు చేరుతున్న మిస్సింగ్ కేసులెన్నో. తల్లిదండ్రుల, పోలీసుల బాద్యతారాహిత్యమో..? మృగాళ్ల అమానుషమో..? ఈ అభం శుభం తెలియని అమాయకురాళ్లు నరమేధంలో సమిధలుగా మిగులుతున్నాయి. 2017సంవత్సరంలో రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లల్లో ఇంకా 681మంది ఆచూకీ లభించలేదంటే మన వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో కూడా తెలుసుకోవచ్చు.

రాష్ట్రంలో పిల్లల అదృశ్యం ఉదంతాలు దు:ఖాంతాలవుతున్నాయి. ఒక్కో అదృశ్యం వెనుక ఒక్కో మిస్టరీ ఉండి.. క్రైమ్ సినిమా కథలను తలపిస్తున్నాయి. తమంతట తామే కనిపించకుండా పోయిన పిల్లల్లో చాలా మంది మళ్లీ ఇళ్లకు తిరిగివస్తున్నారు. కానీ అపహరణకు గురైన వారు మాత్రం.. వెట్టిచాకిరిలోనో, వ్యభిచార గృహాల్లోనే, లేకపోతే హాజీపూర్ ఉదంతంలా హత్యాచారానికి గురై శాశ్వతంగా దూరమవుతున్నారు.

ఇక మిస్సింగ్ కేసుల్లో పోలీసుల స్పందన కూడా అంతంత మాత్రమే. ఏవో కొన్ని కేసుల్లో తప్ప.. మిగిలినవన్నీ మొక్కుబడిగా దర్యాప్తు చేసి ఆ తరువాత కేసులు క్లోజ్ చేసేస్తున్నారు. సరైన ఆధారాలు లభించలేదనో.. మరో కారణం పేరిటో వారు చేస్తున్న ఉదాసీనత కూడా క్రైమ్ రేటు పెరిగిపోవడానికి దారితీస్తోంది. తాజాగా హాజీపూర్ ఘటన ఇదే పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. నాలుగేళ్ల క్రితం కల్పన మిస్ అయ్యింది. దీనిపై ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు పెద్దగా స్పందించలేదు. ఒకవేళ అప్పుడే వారు అలర్ట్ అయి ఉంటే ఇప్పుడు మనీషా, శ్రావణిలు తమ ప్రాణాలను పోగొట్టుకునేవారు కాదు. అలాగే మనీషా విషయంలోనూ ఆమె తండ్రి నిర్లక్ష్యం కనిపిస్తోంది. మనీషా అదృశ్యమైన సమయంలో.. ప్రియుడితో వెళ్లిపోయి ఉంటుందని భావించిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదట. దీంతో ఏ తప్పూ చేయని ఆమె చనిపోయినా.. ఇన్ని రోజుల వరకు నిందను మోస్తూనే ఉంది.

తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
అయితే అదృశ్యమైన పిల్లల కోసం తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఎక్కడైనా వ్యభిచార గృహంలో పిల్లల ఆచూకీ బయటపడ్డప్పుడు, అదృశ్యమైన పిల్లలు హత్యకు గురైనట్లు తెలిసినప్పుడు తల్లిదండ్రులు అక్కడ వాలిపోతున్నారు. పట్టుబడ్డ వారిలోనే, ప్రాణాలు కోల్పోయిన వారిలోనూ తమ చిన్నారులు ఉన్నారేమోనన్న ఆతృతతో అల్లాడిపోతున్నారు. గతేడాది యాదగిరిగుట్టలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేకమంది తల్లిదండ్రులు తప్పిపోయిన తమ మైనర్ బాలికల ఆచూకీ కోసం ఆరా తీసిన విషయం తెలిసిందే.

పిల్లల అదృశ్యాల విషయంలో ఇప్పటికైనా సమాజం తీరు మారాలి. నిందితులకు కఠిన శిక్షలు పడేలా వ్యవస్థలు మారిన పక్షంలో కొంతలో కొంతైనా మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయని మానవతావాదులు అభిప్రాయపడుతున్నారు. కల్లాకపటం తెలియని బాలికల ఉసురు పోసుకుంటోన్న మృగాళ్లకు ఎలాంటి శిక్ష వేయాలో న్యాయనిపుణులే తేల్చాలి. గతంలో ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు. నిందితులకు నిర్భయ చట్టం కింద పడిన శిక్షలు వారిలో ఎలాంటి మార్పు తెచ్చాయో మనం చూస్తూనే ఉన్నాం. ఈ చట్టం కింద శిక్షలు పడిన వారు నిర్భయంగా బయట తిరుగుతున్నా.. సమాజం చోద్యం చూస్తోంది. మార్పు తప్పనిసరిగా వస్తే తప్ప ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది.