Political group fight in Chittur district YCP: స్థానిక ఎమ్మెల్యే లేకుండానే అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరిగింది. అది కూడా ఏకంగా డిప్యూటీ సీఎం నిర్వహించారు. దాంతో స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు సదరు ఉప ముఖ్యమంత్రిపై మండిపడుతున్నారు. మొత్తానికి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం అధికార పార్టీలో రాజకీయ రచ్చకు తెరలేచింది. నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య గ్రూపు రాజకీయాలు వెలుగు చూశాయి.
స్థానిక ఎమ్మెల్యే రోజా లేకుండానే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కలిసి నగరి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరపడం రోజా వర్గీయుల్లో ఆగ్రహం రేపింది. పుత్తూరులో ఎమ్మెల్యే రోజా లేకుండానే సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం. ఈ సమీక్షకు కలెక్టర్ భరత్ నారాయణ గుప్తా కూడా హాజరయ్యారు.
పుత్తూరులోని గుట్ట స్థలంలో కల్యాణమండపం నిర్మాణంపై సమావేశంలో చర్చించారు. అయితే స్థానిక ఎమ్మెల్యే రోజాను ఈ సమీక్ష సమావేశానికి పిలవకపోవడంపై రోజా వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు వచ్చి తమ నియోజకవర్గంలో సమావేశం పెట్టడమేంటని రోజా వర్గీయులు మండిపడుతున్నారు. తాను లేకుండానే సమీక్ష జరపడంపై ఎమ్మెల్యే రోజా ఆగ్రహంతో వున్నప్పటికీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటిస్తున్నారని తెలుస్తోంది.