ఆన్లైన్ ద్వారా మెడిసిన్ సహా, వైద్య సలహాలు, డాక్టర్ కన్సల్టేషన్ పొందేందకు ఆరోగ్య సేతు యాప్తో అనుసంధానించబడిన మిత్ర్ పోర్టల్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు తెలియజేసింది. సదరు పోర్టల్ ఆన్లైన్ ఫార్మసీలను ప్రోత్సహిస్తోందని ఆరోపించిన సౌత్ కెమిస్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. జస్టిస్ నవీన్ చావ్లా నేతృత్వంలోని ధర్మాసనం ముందు అదనపు సొలిసిటర్ జనరల్ మనీందర్ ఆచార్య ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతానికి పోర్టల్ నిలిపివేయబడిందని చెప్పారు.
పిటిషనర్ తరపున ఈ కేసును వాదించిన సీనియర్ అడ్వకేట్ సుధీర్ నంద్రాజోగ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఆన్లైన్ ఫార్మసీలను నిషేధించే ప్రస్తుత నిబంధనలకు మిత్ర్ పోర్టల్ విరుద్ధంగా ఉందని అంగీకరించనట్టే అన్నారు. పిటిషన్కు కౌంటర్ లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (మోహెచ్ఎఫ్డబ్ల్యూ) గత వారం దాఖలు చేసిన అఫిడవిట్లో ఆన్లైన్ ఫార్మసీల ముసాయిదా నిబంధనలు ఇంకా రూపొందించబడలేదని తెలిపింది. కోవిడ్-19 నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి అడుగు బయటపెట్టకుండానే అత్యవసర వైద్య సేవలు అందుకునేందుకు ఈ పోర్టల్ ప్రవేశపెట్టారు.