హైదరాబాద్లో గోపాల గోపాల సినిమా సీన్ రిపీట్ అయింది. అమీన్పూర్లోని మాధవపురి హిల్స్ ఆలయ వివాదంలో దేవుడ్ని హైకోర్టు పార్టీగా చేర్చింది. విష్ణు పంచాయతన దేవాలయం అక్రమ కట్టడం అంటూ ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ అనే వ్యక్తి 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పార్కును కబ్జాచేసి ఆలయం కట్టారని, గుడి కూల్చి వేయాలంటూ పిటిషన్ వేసిన వ్యక్తి ఆరోపించారు. కాగా.. ఆలయ స్థలాన్ని కబ్జాచేయలేదని అన్ని పర్మిషన్లు ఉన్నాయని ఆలయ కమిటీ వాదిస్తోంది.
మాధవపురి హిల్స్ ఆలయంలో వేంకటేశ్వరుడు.. రాజరాజేశ్వరి.. శివుడు.. సూర్యనారాయణ..ఆంజనేయ దేవాలయాలు ఉన్నాయి. అయితే ప్రధాన ఆలయంగా ఉన్న వేంకటేశ్వరుడిని హైకోర్టు పార్టీగా చేర్చింది. దేవుడిని పార్టీ చేయడంతో దేవాదాయశాఖ అధికారులు కోర్టుకు హాజరుకానున్నారు. సంగారెడ్డి జిల్లా దేవాదాయ శాఖ అధికారులు ఫిబ్రవరి 7న కోర్టుకు హాజరై దేవుడి తరుపున వాదించనున్నారు.