Good News To Students: ఏపీలోని డిగ్రీ కాలేజీల ఫీజులను రాష్ట్ర విద్యాశాఖ ఖరారు చేసింది. 2020-21, 2021-22, 2022-23 విద్యాసంవత్సరాలకు ఖరారు చేసిన ఫీజులు అమలులోకి రానున్నాయి. కేవలం విద్య కోసం ఖర్చు చేసే వ్యయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఫీజులను నిర్ణయించాలని గతంలోనే ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆయా కాలేజీల్లో ఉండే సౌకర్యాలు, ప్రమాణాలు, వసతులను దృష్టిలో పెట్టుకుని ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఫీజులను నిర్ణయించి.. ప్రభుత్వానికి అందజేసింది. దానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఆ నివేదిక ప్రకారం.. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, న్యాక్ గుర్తింపు, జాతీయ ర్యాంకుల ఆధారంగా తీసుకుని నాలుగు కేటగిరీలుగా డిగ్రీ కాలేజీలను విభజించి ఫీజులను ఖరారు చేశారు. మొదటి కేటగిరిలోని కాలేజీలకు గరిష్టంగా రూ. 18 వేలు, రెండో కేటగిరికి రూ. 16 వేలు, మూడో కేటగిరి కళాశాలలకు రూ. 14 వేలు, నాలుగో కేటగిరికి రూ. 12 వేలుగా నిర్ణయించారు. అలాగే తొలిసారిగా యాజమాన్యం కోటా కింద 30 శాతం సీట్లను కేటాయించారు. అటు డిగ్రీ, పీజీ కోర్సులకు ఒకే రకమైన ఫీజులు అమలు కానున్నాయి. కన్వీనర్, మేనేజ్మెంట్ కోటాలో చేరే విద్యార్థులకు కమిషన్ నిర్ధారించిన ఫీజులను మాత్రమే కాలేజీలు వసూలు చేయాలి. అలా కాదని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. అంతేకాకుండా విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడితే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు టోల్ఫ్రీ నంబర్తో పాటు గ్రీవెన్స్ సెల్ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
Also Read: Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..