ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్‌ షురు.. కౌంటింగ్‌ కేంద్రాల్లో లెక్కింపు ఎలా ఉంటుందంటే..!

|

Dec 03, 2020 | 8:22 PM

శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్‌ ...

ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్‌ షురు.. కౌంటింగ్‌ కేంద్రాల్లో లెక్కింపు ఎలా ఉంటుందంటే..!
Follow us on

గ్రేటర్‌లో గెలిచేదెవరు? మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ తిరిగి దక్కించుకుంటుందా.. దుబ్బాక గెలుపు ఇచ్చిన జోష్‌తో బీజేపీ సత్తా చాటుతుందా.. తమ కంచుకోటల్లో కాంగ్రెస్‌ సగర్వంగా విజయఢంకా మోగిస్తుందా.. పాతబస్తీ మళ్లీ మజ్లిస్‌దేనా..హైదరాబాద్‌ ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారు.. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మరికొన్ని గంటల్లో సమాధానం రాబోతోంది. గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్‌డౌన్‌ మొదలైంది.

శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండ్‌లో 14 వేల ఓట్లు లెక్కిస్తారు. మూడు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

బల్దియాలో మొత్తం 34 లక్షల 50 వేల 331 ఓట్లు పోలయ్యాయ్‌. మెహిదీపట్నంలో 11 వేల 818 ఓట్లు మాత్రమే పోలయ్యాయి‌. ఇక్కడ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి దాదాపు ఫలితం తేలిపోయే అవకాశం ఉంది. సుమారు 136 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు.. రెండో రౌండ్‌లోనే తెలిసిపోతుందని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో గ్రేటర్ డివిజన్లున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. పాస్‌ ఉంటేనే లోపలకు ఎంట్రీ ఉంటుందని అధికారులు తెలిపారు. మొబైల్ ఫోన్లను కౌంటింగ్ సెంటర్లకు అనుమతి లేదని వెల్లడించారు. అయితే ఇప్పటికే రాచకొండ పరిధిలోని ఆరు సర్కిళ్లలో రౌడీషీటర్లను బైండోవర్ చేసినట్టు సీపీ మహేష్ భగవత్‌ తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.